ఎందుకు? ఏమిటి? ఎలా? - తెలుసుకుందాం!

 

              ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

The purpose of this page is to enable the young students to understand the 

reasons behind the way things happen in the world around the



ప్రశ్న: ఉదయపు సాయంత్రపు సూర్యకాంతి ఎరుపేల ?

జవాబు: భూమ్మీద ఒకచోట సూర్యోదయం జరుగుతున్న సందర్భంలో మరోచోట అది మధ్యాహ్నం కావచ్చు, ఇంకో చోట అస్తమయం, వేరోచోట అర్థరాత్రి కూడా కావచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యబింబం ఎర్రగా లేదా నారింజ రంగులో కనిపించడానికి ప్రధాన కారణం భూ వాతావరణమే. చంద్రుడి మీద నిలబడి సూర్యాస్తమయం, సూర్యోదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా ఒకే విధంగా (దాదాపు తెల్లగా) కనిపిస్తుంది.ఉదయం సాయంత్రం సమయాల్లో భూ వాతావరణంలో ఎక్కువ దూరం సూర్యకాంతి ప్రసరించి మనల్ని చేరుతుంది. మధ్యాహ్నం సమయంలో తక్కువ దూరం ప్రసరిస్తుంది. దీనికి కారణం భూమి, దాని వాతావరణం, గోళాకృతి (spherical shape) లో ఉండడమే.

కాంతి తరంగాలు పదార్థాలగుండా ప్రయాణించే క్రమంలో కొంత మేరకు పరిక్షేపణం (scattering)కావడం ఒక ధర్మం. ఈ పరిక్షేపణం తక్కువ తరంగ ధైర్ఘ్యం (wavelength)ఉన్న ఊదా, నీలం, ఆకుపచ్చ రంగులకు ఎక్కువగాను తరంగదైర్ఘ్యం ఎక్కువగానున్న ఎరుపు, నారింజ రంగులకు తక్కువగా ఉంటుంది. అందువల్ల సౌరకాంతి వాతావరణంలో దూసుకెళుతున్న సందర్భంలో ఎరుపు, నారింజ రంగులు తక్కువే పరిక్షేపణం చెందడం వల్ల ఎక్కువ దూరం వరకు కొంతలో కొంత చేరగలవు. కానీ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిలో మార్గమధ్యంలోనే పరిక్షేపణం బాగా చెంది మనల్ని చేరేలోగానే అంతరించిపోతాయి. ఈ ఘటన తక్కువ దూరమే ప్రయాణించే పరిస్థితి ఉన్నా మధ్యాహ్నం తటస్థపడదు. అందువల్ల అన్ని రంగులూ, వెరసి తెల్లని కాంతిగల సూర్యుణ్ని మధ్యాహ్నం పూట, కేవలం ఎరుపు, నారింజ రంగులే అధికంగా గల సూర్యకాంతిని ఉదయం, సాయంత్రం చూస్తాము.
          

శూన్యంగా ఉండే రోదసిలో అంతరిక్ష యాత్రికులు గాలిని ఎలా పీలుస్తారు ?

    వ్యోమనౌకలో ఉండే తక్కువ ప్రదేశంలో 3 నుంచి 6 మంది వ్యోమగాములు ఉండటంతో గాలి పీల్చుకునే విషయంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అక్కడ వారు క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండటానికి వ్యోమనౌకలో ECLSS (environmental control and life support systems) అనే వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో నీటి నిర్వహణ (వ్యర్థమైన, మూత్రరూపంలోని నీటిని తొలగించడం), కేబిన్‌లో ఉత్పన్నమయే కార్బన్‌డైఆక్సైడ్‌, అమోనియా, మీథేన్‌ లాంటి వాయువులను తొలగించడానికి కావలసిన పీడనం, ఉష్ణోగ్రత, తేమను నియంత్రించడం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ ఉంటాయి.

వ్యోమనౌకలో ఉన్న వారు పీల్చుకోవడానికి కావలసిన గాలి (ఆక్సిజన్‌) రెండు మార్గాలలో లభిస్తుంది. ఒకటి నీటి నుంచి విద్యుత్‌ విశ్లేషణ ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయడం. నీటిలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండటంతో ఈ ప్రక్రియ ద్వారా విడుదలయిన ఆక్సిజన్‌ను శ్వాసించడానికి ఉపయోగించి, హైడ్రోజన్‌ను రోదసిలోకి వదిలేస్తారు. మరో మార్గం వ్యోమనౌక వెలుపలి భాగంలో అమర్చిన టాంక్‌లో పీడనంతో ఉన్న ఆక్సిజన్‌ నుంచి కావలసిన మేరకు ఆక్సిజన్‌ను తీసుకోవడం.

వ్యోమనౌక నుంచి వెలుపలికి వచ్చి రోదసిలో ప్రయోగాలు చేసే వారికి ప్రత్యేకమైన 'స్పేస్‌ సూట్లు' ఉంటాయి. వాటిలో వారు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్‌ను విడుదల చేసే ఏర్పాట్లు ఉంటాయి. అందులో ఉండే 'పెర్‌క్లోరేట్‌ కాండిల్స్‌' అనే పరికరంలో ఉండే లోహాలు రసాయనిక చర్యల ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

                 ప్రశ్న:ఉప్పు చరిత్ర ఏమిటి ?

జవాబు: ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..

అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.

మీకు తెలుసా?
 ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
 ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
 మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.

    What is Mirage-ఎండమావి అంటే ఏమిటి ?

             ఎండమావి (ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వాతావరనము లోని ఉష్ణోగ్రత ప్రభాన ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినపుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పలుచబడి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కాని పైన వున్న గాలి చల్లదనము  వేడిగాలిని పైకి వెళ్ళనివ్వనందున ఈ వేడిగాలి  పక్కకు చేసే ప్రయాణం అలలా ఉండి నీటిప్రవాహాన్ని తలపిస్తుంది... అదే ఎండమావి.

                ప్రశ్న: ఉప్పెన అంటే ఏమిటి?

జవాబు: ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర తీరప్రాంతాన్ని తుపాన్లు తరచుగా తాకుతుంటాయి. తీవ్ర మైన సుపాను ఏర్పడినపుడు వాయువేగం కంటకు 150-200 కి.మీ .దాటి వీచినపుడు .. ఆ గాలికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి తీరప్రాంతాలను ముంచివేస్తుంది. అటువంటి పెను తుఫాను నే ఉప్పెన అంటారు. ఉప్పెనలు సముద్రములోపలి అగ్నిపర్వతాలు బద్ధలైనపుడు కూడా ఏర్పడవచ్చు . నేడు మనము చెప్పుకునే " సునామీ" ల వంటివే ఈ ఉప్పెనలు కూడా.
        

         
గబ్బిలాలు రాత్రి పూటనే ఎందుకు సంచరిస్తాయి? పగలు కన్నా రాత్రి బాగా కనిపిస్తుందా ?

            పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు. అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు.

గబ్బిలాలు నోటితో అతిధ్వనులను (ultrasonic sounds) చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి. ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర (nocturnal) జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి.

    ప్రశ్న:ఉష్ణోగ్రత ప్రభావము బంతి పై ఉంటుందా?

జవాబు: చలికాలము లో రబ్బరుబంతిని నేలకు కొట్టినపుడు అది వేసవికాలము లో ఎగిరిన విధము గా పైకి ఎగరదు . దీనికి కారణము బంతిలోపలి గాలి మీద ఉష్ణోగ్రత ప్రభావము ఉండటమే . గాలి చల్లబడినందున ఆ గాలి ఎక్కువ రాపిడిని ఇస్తుంది .

అదేవిధము గా చలి ప్రభావము రబ్బరు మీద ఉంటుంది. రబ్బరు అంతగా సాగదు . ఈ కారణాలవల్ల బంతి నేలకేసి కొట్టినప్పుడు అక్కడే ' ధబ్ ' మని ఆగినట్టనిపిస్తుంది కాని గాలిలోకి తిరిగి అంతగా ఎగరదు . వేసవికాలము లో ఉష్ణోగ్రత వలన వ్యాకోచము చెందిన బంతి లోపలి గాలి, రబ్బరుమీద ఉషోగ్రతవలన రబ్బరు సాగే గుణము ఎక్కువగా ఉండడము వల్ల చురుకుగా ఎగరటం జరుగుతుంది .
      

  ప్రశ్న:అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు ?

జవాబు: చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి.

వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు.

          చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి ?

            అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

 ప్రశ్న: ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం ?

జవాబు: శాస్త్రవేత్తలు 1960 నుంచి అతి పెద్ద రేడియో ఏంటినాల సాయంతో భూమిపైనే కాకుండా ఈ విశ్వంలో మరెక్కడైనా ప్రాణులున్నాయా అని రోదసినంతా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు వారు ఆశించిన ఫలితాలు లభించలేదు.

కాలిఫోర్నియాలో రూపొందించిన ఒక టెలిస్కోపు సముదాయం ఉంది. అది బిలియన్ల సంఖ్యలో ఉండే రేడియో ఛానల్స్‌ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల రహస్యాలను వెలువరించగలదు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమే భూమిపై కాకుండా విశ్వంలో మరేదైనా నాగరికత ఉందా అనే అన్వేషణకు అంకితమైన SETI అనే గ్రహాంతర జీవుల అన్వేషణ సంస్థ. 1960లో ఫ్రాంక్‌డ్రెక్‌ అనే నక్షత్ర శాస్త్రజ్ఞుడు విశ్వంలోని మరేదైనా ప్రాంతం నుంచి మరో నాగరికతకు సంబంధించిన ప్రాణుల నుంచి ఏవైనా సంకేతాలు వస్తున్నాయా అనే అన్వేషణలో, మన పాలపుంతలో అలాంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ ప్రయాసలో ఆయన ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం ద్వారా మన నక్షత్ర మండలంలో మన కన్నా సాంకేతికంగా పురోగమించిన నాగరికతల సంఖ్యను లెక్కకట్టవచ్చు. లోపమల్లా ఈ సమీకరణం ద్వారా సేకరించిన విశ్వాంతర నాగరికతల మధ్య పొంతన లేకపోవడమే.


ప్రశ్న:అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా? 

జవాబు: హాని కలిగిస్తున్నామా, మేలు చేస్తున్నామా అనే విషయం ఆయా సూక్ష్మజీవులకు తెలీదు. వాటి మానాన అవి జీవిస్తుంటాయి. ఇక ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది వాటి జీవన విధానంలో ఒక భాగమే. సాధారణంగా మనం ప్రమాదాన్నే గుర్తిస్తాము కానీ మేలును కాదు. పెరుగు తింటున్నప్పుడల్లా మనం ఈస్ట్‌ బ్యాక్టీరియాను తలుచుకోము. ఏ దగ్గో, జ్వరమో వస్తే అందుకు కారకమైన సూక్ష్మజీవుల గురించి ఆరా తీస్తాము. మొత్తానికి హానిచేసేవైనా, మేలు చేసేవైనా అవి ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి.


            తాబేళ్లు వంద సంవత్సరాలకు పైగా బతుకుతాయనీ, భూమ్మీద ఎక్కువ కాలం జీవించే జంతువని విన్నాను. నిజమేనా? ఇదెలా సాధ్యం?


            మొక్కల్లో 5000 ఏళ్లకు పైగా జీవించేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో ఉన్న బ్రిసిల్‌కోన్‌ పైన్‌ వృక్షం వయస్సు సుమారు 5063 సంవత్సరాలు. ఇలా ఎన్నో కొనిఫెరస్‌ చెట్లు వేలాది ఏళ్లు పెరుగుతూనే ఉండగలవు.

           కానీ జంతువుల విషయానికి వస్తే పొరిఫెరా వర్గానికి చెందిన కొన్ని స్పాంజీలు పదివేల సంవత్సరాల తరబడి బతికేవి ఉన్నాయి. ఇవి వెన్నెముక లేని జీవులు. అయితే వెన్నెముక ఉన్న జీవుల్లో అత్యంత వయస్సు, అధిక ఆయుర్దాయం ఉన్న జంతువు తాబేలే. సాధారణంగా నీళ్లలో ఉండే తాబేళ్లు, నేలపై తిరిగే తాబేళ్లు వేర్వేరు ప్రజాతులు అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకే తరహా జీవులే. 2007 సంవత్సరంలో సుమారు 250 ఏళ్లు జీవించి చనిపోయిన భారతదేశపు తాబేలు 'అద్వైత' అత్యంత అధిక వయస్సు ఉన్న జంతువుగా అభివర్ణిస్తున్నారు.

          ఒక జీవి సగటు ఎత్తు, జీవితాయుర్దాయం, ఆహార సేకరణ, సంతానోత్పత్తి, శ్వాస ప్రక్రియ వంటి ఎన్నో జీవన కార్యకలాపాలు, లక్షణాలు ఆయా జీవుల్లో ఉండే జన్యు స్మృతి (genetic code) ని బట్టి నిర్ధారితమవుతుంది. సాధారణంగా పెరుగుదలలోనూ, జీవి భౌతిక చర్యల వేగంలోనూ హడావిడిలేని జీవుల ఆయుర్దాయం ఎక్కువ. 'నిదానమే ప్రధానం' అన్న సామెతను తాబేలు నడకకే కాకుండా తాబేలు జీవన కార్యకలాపాలకు కూడా అన్వయించుకుకోవచ్చు. తాబేలు కార్యకలాపాలు మందకొడిగా ఉంటాయి. తద్వారా కణాలకు అలసట, క్షయం అనేవి తక్కువ. తాబేలు ఎంత మందకొడి అంటే దాని తలను పూర్తిగా తీసేసినా అది సుమారు నెలరోజులు బతుకగలదు. పైకి వచ్చి ఒకసారి గాలిపీల్చుకుంటే నీటి అడుగున కొన్ని గంటలపాటు ఉండగలదు. తాబేలు డిప్పమీద ఉన్న పెంకుల్లోని వలయాలనుబట్టి దాని రమారమి వయసును అంచనా వేయగలము. శరీరం కింద, పైన గట్టి పెంకుల్లాంటి డిప్పలు ఉండడం, ప్రమాదం సంభవించే క్షణాల్లో శరీరాన్ని మొత్తంగా లోపలికి ముడుచుకోవడం, నెమ్మదైన జీవితం, సాధారణంగా శాకాహార జీవనం తాబేళ్ల అధిక ఆయుర్దాయానికి కారణాలు. ప్రాథమిక కారణం జన్యు స్మృతిదే. తాబేళ్లే కాకుండా కోయి అనే చేపలు కూడా వంద సంవత్సరాలకుపైగా బతకగలుగుతున్నాయి.

ప్రశ్న: అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి ?

              జవాబు: సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు, పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి అంతో ఇంతో ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అలా అరటి కాయ తన లోపల ఎన్నో రక్షక రసాయనాలను (preservatives) సహజంగానే సంతరించుకుని ఉంటుంది. ఇందులో ఫినాలు తరహా రసాయనాలు, ఇనుము, కాపర్‌ లవణాలు ఉంటాయి. మనం అరటికాయ పచ్చని తోలును చీల్చినప్పుడు అందులోంచి ఈ రసాయనాలు కొంచెం జిగురుగా రావడాన్ని గమనించవచ్చు. ఇవి మన చేతులకు కానీ, బట్టలకు కానీ అంటుకుంటూనే బయటి వాతావరణానికి బహిర్గతమవుతాయి. వెంటనే ఇవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణం(oxidise) చెందుతాయి. 

           ఉదాహరణకు ఫినాళ్లు ఆక్సీకరణం చెందితే అవి క్వినోన్లు అనే పదార్థాలుగా మారతాయి. అలాగే లోహ లవణాలు (metal salts) కొన్ని వాటి ఆక్సైడులుగా మారతాయి. ఫినాళ్లకు దాదాపు రంగు ఉండదు. కానీ క్వినోన్లకు ముదురు రంగులు ఉంటాయి. అరటి తొక్క జిగురు చేతికి అంటుకున్నప్పుడు అందులోని ఫినాళ్లు గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో రంగుగల క్వినోన్లుగా మారడం వల్లనే మచ్చలు (కర్రులు) ఏర్పడుతాయి.

🟥 మిల మిల మెరిసే మిణుగురు,చేపలు కథ ఏమిటి ?  Florocent Fish story. 

             చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ ? మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!

          అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

            సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా? నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా. మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పలకొచ్చని అంచనా. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

           మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.


ప్రశ్న: ఈగలు, చిన్న పురుగులు నున్నని గోడల పైన, గాజు పలకల పైన జారిపడిపోకుండా ఎలా నడవగలుగుతాయి అవి జారి పడవెందుకు?

జవాబు: ఈగలు, చిన్న పురుగులు నున్నని గోడల పైన, గాజు పలకల పైన జారిపడిపోకుండా నడవగలుగుతాయి, 

కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన, బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే. పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .


ప్రశ్న: ఎ.టి.యం డబ్బిచ్చేదెలా ?

జవాబు: ఏటీఎం (ATM) అంటే Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ(magnetic strip)లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. 

సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే కేంద్రీయ(central) కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. కేంద్రీయ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే పరారుణ స్పర్శీయ సాధనం (Infrared Sensing Device) ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్‌ బాక్స్‌'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్‌ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్‌ ఎకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో కొందరీ యంత్రాన్ని సరదాగా 'Any Time MoneyÑఅంటారు. -

A.T.M. వాడకము లో జాగ్రత్తలు :

బ్యాంకులలో పొడవాటి క్యూలలో గంటల తరబడి నిలబడే దాదాపు ఎక్కడపడితే అక్కడ అమర్చిన " ఏ.టి.ఎం " వినియోగం ఈ రోజుల్లో భా పెరిగింది . ఎప్పుడు కావాలంటే అప్పుడు , ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి భలే సదుపాయము గా ఉంది . ఏ.టి.ఎం. కార్డును మీరు వినియోగించే సమయము లో చుట్టుప్రక్కలవారెవ్వరూ మీ పిన్‌ నెంబరును గమనించకుండా జాగ్రత్త పడాలి . కార్డు నెంబరు , పిన్‌ నెంబరు ఏ సందర్భములోనూ ఇతర వక్తులకు చెప్పద్దు . 

కొన్ని ఏ.టి.ఎం. లలో ట్రాంసాక్షన్‌ జరిపేందుకు ఏటిఎం లోని స్లాట్ లో కార్డును ఇంసర్ట్ చేయాలి ... కొన్ని మెషిన్‌ లలో స్క్రాపింగ్ సిస్టం ఉంటుంది ... అటువంటి సమ్యాలలో దాని పంప్యూటర్ స్క్రీన్‌ పై వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి . తర్చుగా ఒక ట్రాంసాక్షన్‌ పూర్తికాగానే " do you want to proceed further " అనే ప్రశ్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది . మరో ట్రాంసాక్షన్‌ అవసరము లేనపుడు ' no' బటన్‌ క్లిక్ చేస్తే మీ పని పూర్తి అవుతుంది , లేదంటే మెమరీ లో మీకార్డు డేటా తరువాతవారు చూసే అవకాశము ఉంటుంది . ఏటిఎం కార్డు ను డెబిట్ కార్డు వలె ఉపయోగించాలి . ఏటిఎం - కమ్‌-డెబిట్ కార్డు తో షాపింగ్ కనుక చేస్తే ఆ సమ్యములో కార్డు ఒకసారికి మించి స్కాప్ కాకుండా జాగ్రత్త వహించాలి . ఒకవేళ అలా జరిగితే దానిని గమనించి షాపింగ్ రశీదును మీ వద్ద జాగ్రత్త గా దాచుకోవాలి . 

షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపధం లోనే ఉండేలా చూసుకోవాలి ఆలా చేయడం వల్ల కార్డు ఏసందర్భములోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది . ఏటిఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్‌ వ్యాల్యు (సి.వి.వి.) నెంబరు ఉంటుంది .. ఆనెంబరు నూ మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి . ఈ నెంబరు కూడా ఇతరులము తెలియనివ్వకూడదు . ఈ నెంబరు చాలా ముఖ్యమైనది . ఈ నెంబరు మీవద్ద ఉంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచి అయినా షాపింగ్ చేసుకునే వీలుంటుంది . 

ఏటిఎం కార్డు పోగొట్టుకున్న సందర్భాలలో సదరు బ్యంక్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తప్పక తెలియజేయాలి . కాల్ సెంటర్ లో మీ పేరు నమోదు చేయించుకొని " కంప్లైంట్ నెంబరు " ను తప్పక నోట్ చేసుకోండి . 

ఏ.టి.ఎం. కార్డు పోయినట్లైతే :

కార్డు పోయిన వెంటనే కార్డు జారీచేసిన బ్యాంక్ కు ఆ సమాచారము అందించాలి . ఇందుకోసం కాల్ సెంటర్ లో కంప్లైంట్ నమోదుచేసుకొని ' కంప్లైంట్ నెంబరు ' నోట్ చేసుకోవాలి . మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటిఎం నెంబర్ ను బ్లాక్ చేస్తుంది . తరువాత మీరు ఆ కంప్లైంట్ నెంబరును ఉదహరిస్తూ పోలీష్ స్టేషన్‌ లో పిర్యాదు చేసి , ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయించుకోవాలి . మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటిఎం కార్డును వినియోగిస్తే ఆ వ్యక్తి భారతీయ శిక్షాస్మృతి ప్రకారము శిక్షార్హుడవుతాడు . బ్యాంక్ పిర్యాదు నమోదులో జాప్యము జరిగినా లేదా నమోదు చేసుకోకపోయినా , వినియోగదారుడు '' కన్‌స్యూమర్ యాక్ట్ " కింద బ్యాంక్ పై కేసు పెట్టవచ్చును 


ప్రశ్న:ఆకాశంలో కొన్ని విమానాల వెనుక పొగ చారలు ఎలా ఏర్పడతాయి ?    

జవాబు: విమానం వెనుక ఆకాశంలో పొగ చార కనిపిస్తే అది జెట్‌ విమానమే. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంతో బయటకు వచ్చే పొగనే జెట్‌ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఆ విమానానికి అంత వేగం రావడానికి కారణం దాని వెనుక నుంచి దూసుకువచ్చే జెట్‌. 

ఇదెలా జరుగుతుందంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి 'చర్య'కూ, దానికి సమానమైన ప్రతిచర్య వ్యతిరేకదిశలో ఉంటుంది. ఒక రబ్బరు బెలూన్‌ను బాగా వూది ఒక్కసారిగా వదిలేస్తే అందులోని గాలి వేగంగా బయటకు దూసుకు రావడం దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్‌ విమానాలు, రాకెట్లు పనిచేస్తాయి. 

జెట్‌ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అరలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంటుంది. అలా చేరిన గాలిపై ఆ అరలో అత్యధిక పీడనాన్ని కలిగిస్తారు. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిగాలి ఉన్న అరలో పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. అలా మండిన ఇంధనం వాయుధార రూపంలో విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో, వూదిన బెలూన్‌ నుంచి గాలి వచ్చినట్టుగా, బయటకు దూసుకొని వస్తుంది. వాయువు వేగం వల్ల ఏర్పడే ప్రతిచర్య వల్ల, జెట్‌ విమానం ముందుకు పయనిస్తుంది. జెట్‌ విమానం ప్రయాణించే ఎత్తులో ఉండే వాతావరణంలోని గాలి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల విమానం నుంచి వచ్చే జెట్‌ చిందర వందరగా చెదిరిపోదు అందుకనే విమానం వెళ్లిన తర్వాత కూడా ఆ వాయుధార కనబడుతుంది. ఆ పొగ వల్ల కాలుష్యం ఏర్పడదు.

                

శ్న:చేయి వెలుగులో ఎర్రనేల ? 

జవాబు: ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల మనుషుల చర్మం వివిధ వర్ణాల్లో ఉంటుంది. కొందరు కారు నలుపైతే, కొందరు చామనఛాయలోను, గోధుమరంగు, తెలుపు రంగుల్లో ఉంటారు. ఇందుకు కారణం వారి చర్మపు పొరల్లో కాంతి నుంచి, ఉష్ణం నుంచి శరీరాన్ని కాపాడే మెలనిన్‌ అనే వర్ణద్రవ్య(pigment)రేణువులు వివిధ మోతాదుల్లో ఉండడమే. అయితే చర్మం రంగు ఏదైనా అందరి అరచేతులు, అరికాళ్లు మాత్రం దాదాపు తెల్లగానే ఉంటాయి. దీనికి కారణం వాటి చర్మంలో మెలనిన్‌ రేణువులు లేకపోవడమే. అందువల్ల ఆ చర్మాలు దాదాపు పారదర్శకం (transparent)గా ఉంటాయి. 

ఇలా పారదర్శకంగా ఉండే అరచేతి చర్మం మీదకు టార్చిలైటు వేసినప్పుడు బలమైన కాంతి అరచేతి చర్మంగుండా ప్రసరించి చర్మం కిందున్న దట్టమైన రక్తకేశనాళికల దగ్గర పరావర్తనం చెందుతుంది. రక్తకేశనాళికలు దట్టంగా దారపు పోగుల్లాగా, ఎర్రగా ఉండడం వల్ల అక్కడ పరావర్తనం చెందిన కాంతి అరచేతి చర్మపు పైపొరకున్న గరుకుదనం (unevenness) వల్ల వివిధ దిశల్లోకి వెదజల్లబడుతుంది (scattered). అరచేతి చర్మం కిందున్న రక్తకేశనాళికలు చాలా మటుకు ఎరుపు రంగు కాంతినే ప్రతిబింబిస్తాయి కాబట్టి టార్చిలైటు వేసినప్పుడు అరచెయ్యి ఎర్రగా కనిపిస్తుంది.


ప్రశ్న: ఆకాశం నీలమేల ?

జవాబు: తెల్లని సూర్యకాంతిలో ఊదా, నీలి, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు కలిసి ఉంటాయని చదువుకునే ఉంటారు. వివిధ రంగుల కాంతి కిరణాలు వేర్వేరు తరంగదైర్ఘ్యాలు (wave lengths) కలిగి ఉంటాయి. ఊదారంగుకు అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటే, ఎరుపు రంగు తరంగదైర్ఘ్యం అన్నింటికన్నా ఎక్కువ. కాంతి కిరణాలు భూవాతావరణంలోని నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ధూళి కణాలపై పడినప్పుడు నీలం రంగు ఎక్కువగా పరిక్షేపణం (scattering) చెందుతుంది. 

అంటే నీలం రంగు ఎక్కువగా చెదురుతుందన్నమాట. తరంగదైర్ఘ్యం తక్కువ కావడం వల్ల నీలవర్ణ తరంగాలు వాతావరణంలోని ఎక్కువ అణువులతో ఢీకొని, ఎరుపు రంగుకన్నా ఎక్కువగా చెదురుతాయి. ఇలా చెదిరిన నీలమే మనకు ఆకాశంగా కనిపిస్తుంది. నిజానికి నీలం కన్నా ఊదారంగు తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ. ఆ ప్రకారం చూస్తే ఆకాశం ఊదారంగు (violet) రంగులోనే కనిపించాలి. అలా ఎందుకు కనిపించడం లేదంటే తెల్లని సూర్యకాంతిలో ఊదా కంటే నీలం రంగు పాలు ఎక్కువగా ఉండడమే. అంతే కాకుండా మన కంటికి ఊదా రంగు కన్నా, నీలం రంగును గుర్తించే శక్తి ఎక్కువగా ఉంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం మరీ నీలంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణం పైపొరలోని ఓజోన్‌ అస్తమిస్తున్న సూర్యకాంతిలోని ఎరుపు రంగును పూర్తిగా పీల్చేసుకోవడమే.

ప్రశ్న: ఆకాశములో మెరుపులు ఎలా వస్తాయి?     

జవాబు:ఆకాశములో గాలిలో కలిగే ఘర్షణ వల్ల మేఘాలలో విద్యుదావేశం ఏర్పడుతుంది . మేఘాలలో విద్యుదావేశం అధికమైనప్పుడు అది ఒక మేఘం నుండి మరో తక్కువ విద్యుదావేశమున్న మేఘం పైకి దూకుతుంది. అలా దూకుతున్న విద్యుదావేశము తో శక్తివంతమైన కాంతి వెలువడుతుంది.అదే మనకు కనిపించే మెరుపు . మేఘాలలో విద్యుత్ ఆవేశము కొన్ని సందర్భాలలో భూమిమీదికి దుముకుతుంది . దానినే పిడుగు అంటాం . పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. ఆ పిడుగు వేడికి , తాకిడికి అడ్డువచ్చిన మనుషులు చెట్లు కాలి మసి అయిపోతాయి. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్‌ను పిడుగు అని అంటారు.


ప్రశ్న: అంతరిక్షనౌకల పనేంటి ?

    జవాబు:అంతరిక్షంలోకి మానవరహిత అంతరిక్షనౌకల్ని ఎందుకు పంపుతారు. వాటివల్ల ప్రయోజనాలు ఏమిటి?

 పయనీర్‌-10, వాయేజర్‌-1, వాయేజర్‌-2 లాంటి అనేక మానవరహిత అంతరిక్షనౌకల్ని అంతరిక్షంలోకి పంపారు. ఇంకా అవసరాన్ని బట్టి పంపుతున్నారు.సౌరవ్యవస్థలోని భాగాలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.ఇవి ఎన్నో ఛాయాచిత్రాల్ని తీసి భూకేంద్రానికి పంపుతున్నాయి. ఈ ఛాయా చిత్రాలు శాస్త్రీయవిజ్ఞానం కోసమేగాక ఇతర గ్రహాలు, చందమామ పైకి మానవసహిత అంతరిక్షనౌకలు పంపే మార్గాలు ఎలాగో తెలుపుతాయి.శుక్రుడు, అంగారకుడిపైన ఉన్న వాతావరణం, వాటి ఉపరితలం ఎలా ఉన్నదో? కొంత సమాచారం ఈ అంతరిక్షనౌకల వల్లే తెలిసింది. నిర్దేశించిన పనులతో పాటు ఖగోళ వస్తువుల సమాచారం తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ మానవరహిత అంతరిక్షనౌకల్లో ఉంచారు. అక్కడ జీవులుంటే భూవాతావరణం, భూమి మీద ఉన్న మానవుల గురించి సమాచారం తెలుస్తుంది. వీటిలో మనుషులకు సంబంధించి అనేక ఛాయాచిత్రాలు, 53 భాషల్లోని స్వరాల రికార్డింగ్‌, చంటి పిల్లల ఏడ్పులు, మానవుడి గుండెచప్పుళ్లు, పక్షుల రాగాలు, సాగర ఘోషల శబ్దాల రికార్డింగ్‌లు ఉన్నాయి


ప్రశ్న:ఎంత వానో తెలిసేదెలా ?


జవాబు: ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతంలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసన వర్షపాతాన్ని కొలుస్తారు. ఉదాహరణకు విజయవాడలో 10 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంటే అక్కడి సమతలంపై నిలిచిన నీటి ఎత్తు 10 మి.మీ. అన్నమాట. కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తున నిలబడిందనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం కాదు. అందువల్ల వర్షపాతాన్ని వర్షమాపకం (Rain Gauge) అనే పరికరంతో కొలుస్తారు. 


వర్షమాపకంలో ఫైబర్‌గ్లాస్‌తో కానీ, లోహంతో కానీ చేసిన 10 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక గరాటు (ఫన్నల్‌) ఉంటుంది. ఈ గరాటు ఒక లీటరు ఘనపరిమాణంగల సీసా మూతకు బిగించి ఉంటుంది. గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరిమాణాన్ని కొలవడానికి ఒక కొలజాడీ (measuring jar)ఉంటుంది. చెట్లు, కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై 30 సెంటీమీటర్ల ఎత్తులో వర్షమాపకాన్ని అమరుస్తారు. ఆ ప్రదేశంలో వర్షం పడినప్పుడు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తులో నిలబడుతుంది. అలా సేకరించిన నీటి ఘనపరిమాణాన్ని కొలజాడీలో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతాన్ని లెక్కగడతారు. 


వాతావరణ పరిశోధన కేంద్రాలలోని వర్షమాపకం ఒక సన్నని గొట్టంలా ఉంటుంది. ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలు గుర్తించి ఉంటాయి. అందులోకి చేరిన నీటి మట్టాన్ని బట్టి వర్షపాతాన్ని నేరుగా మిల్లీమీటర్లలో కొలుస్తారు. 


ఏదైనా భౌతిక రాశి (physical parameter)ని రాసేప్పుడు ఏ ప్రమాణాల్లో (units) రాస్తే సులువుగా ఉంటుందో దాన్నే పాటిస్తారు. సాధారణంగా మెట్రిక్‌ విధానం, బ్రిటిష్‌ విధానం గురించి చదువుకుని ఉంటారు. అంతర్జాతీయంగా మెట్రిక్‌ విధానం (Standard International or SI) అమల్లో ఉంది. దీని ప్రకారం దూరానికి మీటరు, కాలానికి సెకను, ద్రవ్యరాశికి కిలోగ్రాము, విద్యుత్‌ ప్రవాహానికి ఆంపియర్‌ ప్రమాణాలు. కొలతల్ని వీటిలోనే చిన్న, పెద్ద ప్రమాణాలుగా వాడతాము. దూరం విషయంలో మిల్లీమీటరు, కిలోమీటరు ఉన్నట్టన్నమాట. కానీ ఒక పరమాణువు సైజును మీటర్లలోనే రాయాలంటే దాన్ని 0.000000002 మీటర్లు అని రాయాల్సి ఉంటుంది. కానీ మీటరులో బిలియన్‌ (వంద కోట్ల భాగం) వంతును నానోమీటర్‌ అనుకున్నాక, పరమాణువు సైజును 20 నానోమీటర్లు అనడం సులువు. అలాగే సూర్యుడికి, భూమికి మధ్య ఉండే దూరాన్ని మీటర్లలో రాయాలంటే 150000000000 అని రాయాల్సి వస్తుంది. 


దీనికన్నా 150000000 కిలోమీటర్లు అని రాయడం తేలిక. అయితే సూర్యుడికి, భూమికి ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్‌ యూనిట్‌ అనుకుంటే అది ఖగోళ విషయాల్లో సులువుగా ఉంటుంది. ఇక వర్షం ద్రవపదార్థమే అయినా, వర్షపాతాన్ని కొలిచే పరికరాల్లో (రెయిన్‌గేజ్‌) కొలతలు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో ఉంటాయి కాబట్టి అలా రాస్తారు. ఒక సమతలమైన ప్రదేశంలో వర్షం కురిస్తే, ఎంత ఎత్తున నీరు నిలబడుతుందనే విషయాన్నే ఆ పరికరాలు చెబుతాయి. ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం, ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటరు వైశాల్యానికి ఒక లీటరు వంతున నీరు చేరిందని అర్థం. 

          

ప్రశ్న:ఆకులలా రాలిపోతాయేం ?


జవాబు:చలికాలంలో చెట్ల లోని జీవక్రియ (మెటబాలిజం) చాలా వరకూ ఆగిపోతుంది. ఆ దశలో చెట్లలో ఉండే ద్రవపదార్థం ఆకుల నుండి భాష్పీభవనం చెందకుండా, చలికాలం మొదలవడానికి ముందే ఆకులు రాలిపోవడం ప్రారంభమవుతుంది. అలా కాని పక్షంలో, చలికాలంలో చెట్లకు నీరు లేకపోవడంతో అవి చనిపోయే (ఎండిపోయే) ప్రమాదం ఉంది. వేసవి కాలంలో కూడా ఆకుల ద్వారా చెట్లలోని నీరు భాష్పీభవనం చెందినా, భూగర్భజలాలు వేళ్లద్వారా అందడం వల్ల చెట్లకు ఎలాంటి హానీ జరగదు. అదే చలికాలంలో భూగర్భజలాలు ఘనీభవించడం వల్ల చెట్లకు వేళ్ల ద్వారా నీరు అందదు. అంతే కాకుండా చెట్లు తమ ఆకులను రాల్చడం ద్వారా వాటి జీవక్రియల్లో వెలువడి ఆకుల్లో పేరకుపోయిన వ్యర్థపదార్థాలను చెట్లు వదిలించుకున్నట్లు అవుతుంది.


ప్రశ్న: సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది ?

జవాబు: సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి. *ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్‌, అది కరోనా అయినా సరే.. నీటితోపాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది. ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండటానికి గల రహస్యం దాని హైబ్రిడ్‌ నిర్మాణమే.సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్‌, తోకభాగాన్ని హైడ్రోఫోబిక్‌ అంటారు. హైడ్రోఫిలిక్‌ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్‌ భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్‌కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది. ● నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినపుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్‌ భాగాన్ని తనతో తీసుకుపోతుంది.* దీంతో సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్‌లు సైతం సబ్బు అణువుతో చేతి నుంచి విడుదలై బయటకు వెళ్లిపోతాయి. సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్‌ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది.


  ప్రశ్న: 🌲క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?Christamus Tree Story.

రకరకాల బహుమతులు..

 బొమ్మలు.. కేకులతో.. క్రిస్‌మస్‌ పండుగ చేసుకుంటున్నారు కదా! మరి క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? శాంతాక్లాజ్‌ తాతయ్య ఎవరో తెలుసా? ఆ కథలేంటో తెలుసుకుందామా!


వరాలిచ్చే చెట్టు! --క్రిస్మస్‌ నాడు చెట్లను అందంగా అలంకరిస్తారు కదా, మరి ఆ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దాని వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి.

చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...! వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్‌ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టుని అలంకరిస్తున్నారు.


ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.

చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్‌, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు. 'ఓ జీసస్‌ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?' అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు. 'తిని నాలుగు రోజులైంది' అన్నాడా పిల్లాడు దీనంగా. తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు. అతడి ఆకలిని తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అర్థరాత్రి అన్నాచెల్లెల్లిద్దరికీ మెలకువ వచ్చింది. పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు. బాల ఏసు! తల మీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతున్న అతడు, 'మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు' అని దీవించాడు. వాళ్లింటి బయట ఎండిన కొమ్మని నాటాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదైంది. దాన్నిండా బంగారు యాపిల్‌ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్‌మస్‌ చెట్టు.


బహుమతుల తాతయ్య!

ఎర్రటి గౌను, టోపీ, తెల్లగడ్డంతో బహుమతులిచ్చే శాంతాక్లాజ్‌ తాతయ్య అసలు పేరు తెలుసా? నికోలస్‌. క్రీస్తుశకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలోని ఓ చర్చిలో బిషప్‌. గుర్రం మీద తిరుగుతూ పేదవారికి సాయం చేస్తుండేవాడు. ఓ రోజు ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడతున్న పేదవాడు కనిపించాడు. అతడికి సాయం చేయడానికి బంగారు నాణాలు నింపిన మూడు మూటల్ని వాళ్లింటి పొగగొట్టంలోంచి పడేశాడు. ఆ డబ్బుతో పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. అలా ఎంతమందికో తనెవరో తెలియకుండా బహుమతులు ఇచ్చే అతడికే సెయింట్‌ హోదా లభించింది. అతడే శాంతాక్లాజ్‌!



 ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్‌ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈ చెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్లతో అలంకరించారు.


    క్రిస్మస్‌ చెట్టును మొదటిసారిగా అలంకరించింది 1510లో. ఇళ్లల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.

    అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్‌ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు.


  ప్రశ్న:ఆకులు రంగులు మారుస్తాయా ? 

జవాబు:చెట్ల ఆకులు రంగులు మార్చవు . అప్పుడే పుట్టిన ఆకులు(చిగురాకులు) లేత ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆ తర్వాత పూర్తి ఆకుపచ్చగా మారుతాయి. అయితే ఇది రంగు మార్చుకోవడము కాదు . లేత ఆకు తన మీద కీటకాలు దాడిచేసి తినకుండా వుండేందుకు చేసుకున్న ఏర్పాటు . ఆ ఎరుపు రంగును కీటకాలు గుర్తించలేవు . లేత ఆకుల్లో ఉండేటటువంటి ఒక రకమైన రసాయనము దానిని రుచిలేని ఆకుగా మారుస్తాయి. పైగా లేత ఆకుల్లో పత్రహరితము కాక " ఎంథోసైనిన్‌ " అనే వర్ణకము అధికముగా ఉండి ఎరుపు రంగును ఇస్తుంది. ఈ వర్ణకము సూర్యుడి ఎండతీవ్రతకు లేత ఆకు మాడకుండా రక్షిస్తుంది.

ప్రశ్న: టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల ?

🍅జవాబు: వృక్షశాస్త్రం ప్రకారం టమాటా కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసీ (solanaceae)కి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానమ్‌ లైకోపెర్సికమ్‌. టమాటా పైపొర పలుచని సెల్యులోజ్‌ నిర్మితం. ఇందులో గట్టిగా కాకున్నా, దృఢంగా ఉండే లైకోపీన్‌ (lycopene) అనే గ్త్లెకోప్రోటీను ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోశాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే అరాయించుకోగలవు. కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్‌లాంటి పాలీశాకరైడులను జీర్ణం చేయలేదు. టమాటా పండు చర్మం పాలీశాకరైడులు, గ్త్లెకోప్రొటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితమయినందున అది జీర్ణం కాకుండా అలాగే పీలికలుగా విసర్జితమవుతుంది.


ప్రశ్న: బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకు ?

జవాబు:సాధారణ వర్షం కురిసేప్పుడు విద్యుత్‌ సరఫరాను ఆపరు. కేవలం మెరుపులు, వేగంగా వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. బాగా మెరుపులు వచ్చేప్పుడు అవి విద్యుత్‌ తీగలను తాకితే వేల ఓల్టుల విద్యుత్‌ శక్మం (electrical potential) తీగల ద్వారా ఇళ్లు, సబ్‌స్టేషన్లలోకి ప్రసరించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల విద్యుత్‌ సాధనాలు, పరికరాలు పాడయిపోతాయి. విద్యుత్‌ను ముందుగానే ఆపితే నష్టం కొంత నివారణ అవుతుంది. పెనుగాలులు వీచేప్పుడు చెట్లు, స్తంభాలు కూలిపోయి వైర్లు కలిసి విద్యుత్‌ హ్రస్వ వలయం (electrical short circuit) ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.


 ప్రశ్న:ఆక్షిజన్ మాత్రమే రక్తం లో కలుస్తుంది-ఎందుకు ?

జవాబు: ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినపుడు కేవలం ఆక్షిజన్ మాత్రమే ఎందుకు రక్తం లో కలుస్తుంది ... నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు ?. 

గాలిలో ప్రధానం గా నైట్రోజన్ , ఆక్షిజన్ వాయువులు 4:1 నిష్పత్తి లో ఉన్నాయి ... నిజానికి గాలిలో 80% ఉండేది నైట్రోజన్ వాయువే . అది మన శ్వాసక్రియలో ఉపిరితిత్తుల్లోకి ప్రవేశించినా వచ్చిన దారినే తిరిగి బయటికి వస్తుంది ... అది రక్తం లో కలవదు . ఆక్షిజన్ గాలిలో 20% మాత్రమె ఉన్నా అది రక్తం లో కలుస్తుంది . 


ఉపిరితిత్తులు స్పాంజి లు గా ఉంటాయి . గాలి మూలమూలలా వ్యాపిస్తుంది . . ఆ గాలి చిట్టచివరికి శ్వాస గుళిక (Alviolous) లో చేరుకుంటుంది . ఈ శ్వాసగులిక గోళాల్లో పలుచని చర్మంగల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది , ఈ రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి . జైత్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .


ప్రశ్న: ఎంపి 3 అంటే ఏమిటి ?

జవాబు: సుమారు ఇరవియా సంత్సరాల కిర్తము వరకు సంగీతాన్నీ టేపు రికార్డుల్లో అయస్కాంత లక్షణాల ఆధారంగానో , గ్రామఫోన్ రికార్డుల్లో గరుకుదనం ఆధారం గానో నిల్వచేసేవారు. ఇలాంటి సాధనాలను " అనలాగ్" సాధనలంటారు . ఇపుడు కంప్యూటర్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు లో మిక్రోప్రోసేసర్ పద్దతులు వచ్చాక అనలాగ్ సమాచారము డిజిటల్ ఉర్పములోకి మారింది . ఇందులో 0 లేదా 1 అంకెల శ్రేణి రూపం లో భద్రపరిచే విధానాన్ని బైనరి సమాచారము అంటారు . సంగీత ధ్యనులను ఎలక్ట్రానిక్ హెచ్చు తగ్గులు గా తర్వాత బైనరీగా మారుస్తున్నారు . 


motion picture Expert Group అనే సాంకేతిక సంస్థ .. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థకు , ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ కి అనుబందముగా ఉంది . ఇది దృశ్య ,శబ్ద నియకాలను నిర్దేశిస్తుంది. ఈ సంస్థ సంక్షిప్త నామమైన " MPEG" లోని మొదటి రెండు అక్షరాలు ... ముడో తరగతికి చెందిన పద్ధతికీ సూచనగా 3 కలిపి MP3 గా వాడుకలోకి వచ్చాయి . మొత్తానికి ఇది సంగీత ధ్యనులను కుదించి నమోదు చేసే ఒక ప్రక్రియ అన్నా మాట. 

         

ఏటీఎమ్ లో కాస్త జాగ్ర‌త్త‌గా..

‌న దేశంలో బ్యాంకు ఖాతాలు క‌లిగిన వారి సంఖ్య బాగా పెరిగింది. జ‌న్ ధ‌న్ ప‌థ‌కం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు బ్యాంకు ఖాతాలు తెరిచారు. దీంతో ప్ర‌భుత్వ రూపొందించిన‌ రూపే కార్డు వినియోగం అందుబాటులోకి వ‌చ్చి డెబిట్ కార్డులు వాడే వారి సంఖ్య మ‌రింత పెరిగింది. అదే స‌మ‌యంలో వీటి ద్వారా మోసాల‌కు గుర‌య్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతిక‌ను వినియోగించి చేసే ఆర్థిక సైబ‌ర్ నేరాల సంఖ్య అధిక‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో ఏటీఎమ్‌ల ద్వారా కార్డు స‌మాచారం త‌స్క‌రించి మోసాల‌కు పాల్ప‌డే స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.


స్కిమ్మింగ్:

      సాధార‌ణంగాినియోగ‌దార్లు ఏటీఎమ్‌కు వెళ్లిన‌పుడు త‌మ‌ కార్డును ఏటీఎమ్ స్లాట్ లో పెట్టి పిన్ వివ‌రాలు న‌మోదుచేస్తారు. కార్డు వివ‌రాల‌ను గుర్తించి ఏటీఎమ్ మెషిన్ లావాదేవీలు చేసేందుకు అనుమ‌తిస్తుంది. ఈ స్వ‌ల్ప‌కాలంలోనే మీ కార్డు స‌మాచారం మొత్తం చోరీకి గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఇదొక హైటెక్ మోసం . ఏటీఎమ్ వినియోగించే స‌మ‌యంలో కార్డు స‌మాచారాన్ని ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రం ద్వారా అప‌హ‌రించ‌డాన్ని స్కిమ్మింగ్ అంటారు. ఇలా సేక‌రించిన స‌మాచారంతో మోస‌గాళ్లు లావాదేవీలు చేయ‌డం లేదా క్లోనింగు చేసి న‌కిలీ కార్డుల‌ను త‌యారుచేయ‌డం వంటి ప్ర‌మాదాలు ఉంటాయి.

స‌మాచారాన్ని అప‌హ‌రించేందుకు ఉప‌యోగించే ప‌రిక‌రాన్ని స్కిమ్మ‌ర్‌ అంటారు.ఇది చూసేందుకు ఏటీఎమ్ కార్డు పెట్టే స్లాట్‌లో క‌లిసిపోయేట్టుగా ఉంటుంది. ఏటీఎమ్ కార్డు వివ‌రాల‌ను దొంగిలించేందుకు అవ‌స‌ర‌మ్యే కార్డురీడ‌ర్ ను ఇది క‌లిగి ఉంటుంది. ‘కార్డురీడ‌ర్ అంటే స‌మాచారాన్ని సేక‌రించే ప‌రిక‌రం. ఏటీఎమ్ కార్డు మాగ్న‌టిక్ స్ట్రిప్ పై ఉన్న స‌మాచారాన్ని రీడ్ చేస్తుంది.’ ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డేవారు ఈ స్కిమ్మ‌ర్ల‌ను ఏటీఎమ్‌కు అమ‌ర్చి తద్వారా కార్డు వివ‌రాలు త‌స్క‌రిస్తారు.

 పిన్‌ను అప‌హ‌రించేందుకు పిన్ న‌మోదుచేసే కీప్యాడ్ పై వేరొక స‌న్న‌ని పొర లాంటి దాన్ని అమ‌ర్చ‌డం చేస్తుంటారు. దీని ద్వారా పిన్ నంబ‌రును తెలుసుకుంటారు. కీప్యాడ్ పై పిన్ టైప్ చేసేట‌పుడు దానికి అమ‌ర్చిన స్కిమ్మ‌ర్ వెంట‌నే మోస‌గాళ్ల మొబైల్‌కు మెసేజీలు పంపే సాంకేతిక‌ను ఉప‌యోగిస్తున్నారు.


పిన్ హోల్ ప‌రిమాణంలో ఉన్న కెమేరాను అమ‌ర్చి మీరు టైప్ చేసే పాస్‌వ‌ర్డ్ వివ‌రాల‌ను తెలుసుకుంటారు.

 వ్య‌క్తుల ప్ర‌మేయం అవ‌స‌రం లేకుండా ఏం జ‌రుగుతుందో వినియోగ‌దార్ల‌కు తెలియ‌కుండా మొత్తం స‌మాచారాన్నిదొంగిలిస్తారు. స్కిమ్మ‌ర్ ద్వారా రికార్డు చేసిన కార్డు వివ‌రాల‌ను నేరుగా వారి కంప్యూట‌ర్ ల‌కు చేరేవిధంగా ఏర్పాటు చేస్తారు. ఇలా దొంగిలించిన స‌మాచారంతో ఆన్‌లైన్ షాపింగు, పీఓస్ ప‌రిక‌రాల‌ ద్వారా కొనుగోళ్లు, న‌కిలీ ఏటీఎమ్ కార్డుల త‌యారీ మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి మోసాల‌ను గుర్తించాలంటే సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌వాలే అని చెప్పాలి. ఎందుకంటే అంత చాక‌చ‌క్యంగా, తెలివిగా సాంకేతిక‌ నైపుణ్యాన్ని వినియోగించి మోసాలు చేస్తున్నారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఇలాంటి వాటిని ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు.

 ఏటీఎమ్ కి వెళ్ల‌గానే కార్డు స్లాట్‌ను గ‌మ‌నించాలి. స్కిమ్మింగు ప‌రిక‌రం అమ‌ర్చిన ఏటీఎమ్ కార్డు పెట్టే స్లాట్ ప‌రిమాణం పెద్ద‌గా ఉంటుంది. ఏటీఎమ్ కు అతి సూక్ష్మ‌మైన కెమెరాలు లాంటి ప‌రిక‌రాలు ఏవైనా అమ‌ర్చారేమో చూడాలి. అలాంటి సూక్ష్మ ప‌రిక‌రాల ద్వారా మీరు టైప్ చేసే పాస్‌వ‌ర్డ్ ను అప‌హ‌రిస్తారు. ఎప్పుడూ వినియోగించే ఏటీఎమ్ అయితే ఏమైనా మార్పులు జ‌రిగితే వెంట‌నే ప‌సిగ‌ట్ట‌గ‌లం. కాబ‌ట్టి ఒక్కోసారి ఒక్కో ఏటీఎమ్ కాకుండా త‌క్కువ ఏటీఎమ్‌లు వినియోగించాలి.

ఏటీఎమ్ కార్డును స్లాట్ లో పెట్టేట‌పుడు నేరుగా పెట్టి తీస్తే దానిపై ఉన్న స‌మాచారం స్కిమ్మ‌ర్ ద్వారా రికార్డు అవుతుంది. కార్డును కొంచెం అటుఇటు క‌దిలించాలి. ఏటీఎమ్ పిన్ న‌మోదుచేసే ప్యాడ్ పై ఏమైనా ప‌లుచ‌ని స్క్రీను లాంటివి అమ‌ర్చిఉన్నాయేమో ప‌రిశీలించాలి. పిన్ న‌మోదు చేసేట‌పుడు కీప్యాడ్ ను పూర్తిగా మూసివేయాలి. నేర‌గాళ్ల‌కు ఏటీఎమ్ కార్డు వివ‌రాలు తెలిసిన‌ప్ప‌టికీ పిన్ తెలియ‌క‌పోతే మోసం చేసే అవ‌కాశం తక్కువ.

ప్రశ్న:ఆక్సిజన్ ఎలా ఏర్పడింది ? 


 జవాబు:భూమి ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ సుమారు 6,000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడిన సుమారు 3,000 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అధిక వేడి వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం వాతావరణంలోని మార్పులకు విస్ఫోటనం చెంది చల్లబడి, ఘనీభవించి భూగోళంగా ఉద్భవించింది. సముద్రంలోని అట్టడుగున ఉన్న రసాయనాలను బట్టి మొదట్లో గాలిలో రకరకాల విషపూరిత వాయువులు ఉన్నాయని ఆ వాయువులన్నీ పరస్పర చర్య జరపటం వల్ల ఆక్సిజన్ వాయువు పుట్టిందని తెలుస్తోంది.


ప్రశ్న: ఒక లోహపు పాత్ర నిండా నీటిని నింపి వేడి చేస్తే ముందుగా పాత్ర లోని నీటి మట్టము కొంచము తగ్గి ఆ తరవాత పెరుగు తుంది . ఎందుకు ?


జవాబు: పదార్దాల గుండా ఉష్ణము ప్రవహించే విధానాన్ని " ఉష్ణ లక్షణము (thermal conductivity)" అంటారు . పదార్ధాలను వేదిచేసినపుడు వాటి ఘనపరిమాణము సాధారణము గా

 వ్యాకోచిన్చదాన్ని 'ఉష్ణ యాంత్రిక (thermal expansivity)' అంటారు . నీటి విసయము లో ఈ రెండు సమన్వయము గా పని చేస్తాయి. లోహాలకు నీటికన్నా అధిక వాహకత్వ లక్షణము ఉంటుంది . అందువల్ల మొదట లోహపాత్రకు ఎక్కువ ఉష్ణము వెళ్లి అది త్వరగా వేడెక్కుతుంది ... కాబట్టి నీటి కన్నా ముందే పాత్ర వ్యాకోచిస్తుంది . .. అంటే పాత్ర ఘనపరిమాణము పెరుగు తుంది . అంతే తీవ్రత తో నీటి ఘన పరిమాణము వ్యకోచిన్చకపోవడం వల్ల మొదట్లో నీటి మట్టము తగ్గుతుంది . క్రమేపి ఉష్ణము నీటికి తాకి పాత్ర , పాత్ర లోని నీరు .. ఉష్ణోగ్రత పరంగా సమతుల్యాన్ని (thermal equilibrium) చేరు కుంటాయి . అయితే ఘన పదార్ధాల కన్నా ద్రవ పదార్ధాలకు ఉష్ణ వ్యాకోచ గుణము ఎక్కువ , ఒకే రకమైన ఉష్ణోగ్రతా వృద్దిని (temperature rise) ఇస్తే అంతే ఘన పదార్ధమైన పాత్ర కన్నా ... ద్రవ పదార్ధమైన నీరు బాగా వ్యాకోచిస్తుంది ... కాబట్టి వేడి చేస్తున్న సమయము లో క్రమముగా నీటి ఘనపరిమాణము పాత్ర ఘనపరిమాణము కన్నా బాగా పెరుగు తుంది .

నీరు ఎక్కువ సేపు మరిగిస్తే ఆవిరై నీరు పరిమాణము తగ్గును . పై న చెప్పిన సిద్ధాంతము వేడిచేయు మొదటిలోనే జరుగుతాయి


 ప్రశ్న:ఎక్కువసేపు నవ్వితే చేతుల్లో నొప్పిపుడుతుందెందుకు ?


జవాబు: మానవ మొండెము మధ్యలో చాతి లోని గుండె , ఊపితిత్తులను ... పొట్ట భాగములోని జీర్ణాశయము , జీర్ణావయవాలను వేరుచేస్తూ " డయాప్రమ్‌ " అనే ఉదరవితానము (పొర ) ఉంటుంది . బాగా నవ్వినప్పుడు ఎక్కువగా గాలి లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులు పూర్తిగా నిండి డయాప్రమ్‌ పొరని కిందికి నెట్టుతాయి. . . అదే సమయములో ఉదర కండరములు సంకోచించడమువలన డయాప్రమ్‌ పైకి నెట్టబడుతుంది . ఇలా అనేక సార్లు నిరంతరము గా జరుగుతూ ఉంటే కండరముల ఈడ్పు (Strech) జరుగుతుంది . 

ఉదర వితాతనము (డయాప్రమ్‌) తో సంబంధమున్న కండరము , భుజము (shoulder) కండరాలతో సంబంధము ఉన్నందున స్ట్రెచ్ తోపాటు ముఖ్యము గా కుడి చెయ్యికూడా నొప్పికి లోనవుతుంది . ఆనందముగా అలా నవ్వుతూ ఉంటే హార్ట్ ఎటాక్ నొప్పి ఏమోనని అనుమానము కలుగుతుంది . తక్కువగా గాలి పీల్చడమూ, నెమ్మదిగా శ్వాస క్రియ జరపడము , మరీ ఎక్కువగా తినకపోవడమూ వలన శరీరానికి మేలు జరుగుతుంది . 

      

ప్రశ్న: అన్ని పక్షులు వాటి పిల్లలకు పాలు ఇవ్వవు. కానీ గబ్బిలం మాత్రం పిల్లలకు పాలు ఇస్తుంది. ఇది కూడా పక్షే కదా ?


జవాబు: గబ్డిలం పక్షి కాదు. పక్షిలాగా రెక్కలున్న ఓ క్షీరదం(mammal) . ఇది కైరాప్టెరా అనే క్రమానికి చెందిన పాలిచ్చే జంతువు. ముందు వెనక కాళ్లవేళ్ల మధ్య బాతు కాళ్లకున్నట్టు చర్మపైపొర ఉండడం వల్ల ఇది పక్షిలాగా ఎగరగలదు. పదునైన కొక్కెంలా ఉన్న గోళ్లసాయంతో చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంది. దీనికి కళ్లున్నా గుడ్డిది. తన నోటితో తానే అతి ధ్వనులను (ultrasonic sounds) చేస్తూ ఆ ధ్వనుల ప్రతిధ్వనుల (echos)ను వినడం ద్వారా పరిసరాలను, వస్తువులను ఆహారాన్ని చూస్తుంది. మిగిలిన క్షీరదాలలోలాగానే ఆడ, మగ లైంగికత ఉంది. ఆడ గబ్బిలం గర్భం ధరించి పశువులు, మనుషులలాగానే పిల్లల్ని కంటుంది. తడవకు ఒకే బిడ్డను కంటుంది. ఆడమగ గబ్బిలాలు కలుసుకున్నా ఆహారం సమృద్ధిగా దొరికే వరకు ఫలదీకరణం జరగకుండా శుక్రకణాల్ని, అండాన్ని విడివిడిగా తన శరీరంలోనే ఉంచుకోగల అద్భుత సామర్థ్యం ఆడగబ్బిలాలకు ఉంది. బిడ్డ గబ్బిలం తనలాగే ఎగిరే వరకు తల్లి పాలిచ్చి పోషిస్తుంది.


ప్రశ్న: కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా ?

జవాబు: పానీయాల్లో చాలావరకూ స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే క్షారాలు (alkaloids) ఉంటాయి. ఉదాహరణకు కాఫీలోని కెఫైన్‌, టీ లోని థియోఫిలైన్‌, కోక్‌లోని కొకైన్‌. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో, ఈ క్షారాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం పానీయాలు కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలను సడలించి సేదతీర్చడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువ పని చేయించడమే కాక, మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువవుతుంది. అలసట తగ్గుతుంది. ఏదో కొత్త ధైర్యం, సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ నూతనోత్సాహం తాత్కాలికమే. ఎక్కువ సేపు నిలవదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువ సార్లు తాగితే భ్రమలకు లోనై స్థబ్దత కలుగుతుంది కూడా.


ప్రశ్న: ఆక్సిజన్ లేకుండా ఒక వ్యక్తి ఎంత సేపు జీవించగలడు ? 

జవాబు:ఒక వ్యక్తి ఆక్సిజన్‌ లేకుండా కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలడు. కారణం మెదడులోని కణాలకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. శరీరపు బరువులో మెదడు బరువు 2 శాతమే అయినప్పటికీ, ఒక వ్యక్తి పీల్చుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్ని మెదడే గ్రహిస్తుంది. కాబట్టి దేహానికి రక్తం అందించే ఆక్సిజన్‌ సరఫరా కొన్ని నిమిషాలు ఆగిపోయినా మెదడు స్తంభించిపోతుంది. మెదడు నిర్వర్తించే ప్రక్రియలన్నీ నిలిచిపోవడంతో మరణం సంభవిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన 8 నుంచి 10 సెకన్లలోనే స్పృహ కోల్పోతాడు. అయితే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే, దేహం వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణం తక్కవగా ఉంటుంది కాబట్టి మెదడులోని కణాలు ఎక్కువ సేపు జీవించి ఉండగలవు. ఈ అంశాన్ని బట్టే వైద్యులు గుండెమార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగిస్తారు.


ప్రశ్న: భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల ?


జవాబు: సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రయాణించి భూమిని చేరుతాయనేది తెలిసిందే. వాతావరణంలోని గాలి లోంచి కిరణాలు ప్రయాణించినప్పటికీ గాలి స్వల్పశోషణం (poor absorber) కాబట్టి, వాటిలోని వేడిని అంతగా గ్రహించలేదు. గాలి కంటే భూమి వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల దానిని అంటిపెట్టుకున్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా వేడెక్కిన గాలి సాంద్రత తగ్గుతుంది. దాంతో ఆ గాలి తేలికయి భూమి నుంచి ఎత్తుకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలోకి వెళ్లిన వేడిగాలి అక్కడ వ్యాకోచిస్తుంది. ఏ వాయువైనా వ్యాకోచిస్తే దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడకు వెళ్లిన గాలి చల్లబడుతుంది.


ఈ విధంగా భూమి నుంచి పైపైకి పోయే గాలి ఉష్ణోగ్రత ప్రతి కిలోమీటరుకు 9 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గుతుంటుంది. అందువల్లనే వేసవి కాలంలో ఎత్తుగా ఉండే ప్రదేశాలైన ఊటీ, డార్జిలింగ్‌ లాంటి పర్వత ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళితే అక్కడ మళ్లీ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే భూమి ద్వారా వేడెక్కి పైకి వెళుతూ వ్యాకోచించి చల్లబడే గాలి అంత ఎత్తుకు చేరుకోలేదు.


ప్రశ్న: కొత్త తువ్వాలు నీరు పిల్చదెన్దుకు ?

 

జవాబు: స్నానం చేసిన తరువాత కొత్త taval తో తుడుచు కుంటే ఒంటిమీద ఉన్నా నీరు అలా నిలిచి ఉన్నట్లే ఉంటుంది .. . అదే taval ఒకటి ,రెండు రోజులు ఉపయోగించిన తర్వాత ఇక నేమ్మిది గా నీరు పీల్చు కోవడం మొదలు పెట్టి హాయిగా వాడుకోగాలుగుతాం ,... దీనికి కారణం


ఒక టవల్ గాని మరేదైనా గుడ్డ గాని తయారీ సమయం లో దానిమీద రసాయనాలు ... బట్ట కొత్తదిగాను రంగులు బాగా అద్దుకుని ఆకర్షణీయం గా కనిపించేందుకు వాడతారు . ఈ రసాయనాలు ఉన్నంత వరకు అవి ఒక పోరా గా ఏర్పడి నీటిని పీల్చ నివ్వవు . ఒకటి , రెండు సార్లు టవల్ నీళ్ళలో తడపడం వలన రసాయనాల పొర పోయి నీరు పీల్చుకునే గుణము వస్తుంది.


ప్రశ్న: ఋతు పవనాలు అంటే ఏమిటి ?

జవాబు: ఋతువు ప్రకారము వీచే గాలులే ఋతుపవనాలు . పవనము అంటే గాలి , ఋతువులు అంటే కాలము ; కాలాన్ని బట్టి అనగా వేసవి కాలము , వర్షాకాలము , శీతాకాలము లలో వీచే గాలులు ఒక్కోదిశలో వీస్తాయి.

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటే తెగ బాధపడిపోతాం. కాని ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే వానలు అంత బాగా పడతాయని తెలుసా? వేసవిలో సూర్య కిరణాలు భూమ్మీద ఎలా పడతాయో, సముద్రం మీద కూడా అలాగే పడతాయి. కానీ సముద్రం కన్నా భూమి బాగా వేడెక్కుతుంది. భూమితో పాటు దానిని ఆనుకుని ఉన్న గాలులు కూడా వేడెక్కుతాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ గాలులు వ్యాకోచించి తేలికై, పైకి పోతాయి. అలా పైకి వెళ్లే వేడి గాలుల స్థానాన్ని భర్తీ చేయడానికి సముద్రం పై నుంచి గాలులు భూమి పైకి సమాంతరంగా వీస్తాయి. ఈ గాలులు తేమగా, ఎక్కువ నీటియావిరితో నిండి ఉంటాయి. ఎందుకంటే ఎండ వేడికి సముద్రాల నీరు ఎక్కువ ఆవిరవుతుంది కదా? ఆ నీటి ఆవిరితో ఈ గాలులు నిండి ఉంటాయన్నమాట. ఈ గాలులే రుతుపవనాలకు కారణం.

వేసవి కాలంలో సముద్రాల్లో ఎక్కువ నీరు ఆవిరవుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పీడనం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో నేల (land) వేడెక్కడం వల్ల ఆ ప్రాంతాల్లో గాలులు వ్యాకోచించి పీడనం తక్కువగా ఉంటుంది. గాలులెప్పుడూ అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు వీస్తాయని తెలుసుగా? ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు బాగా ఎక్కువైన పరిస్థితుల్లో సముద్రాల మీద నుంచి గాలులు నేల వైపు బలంగా వీచడం మొదలెడతాయి. సాధారణంగా ఈ పరిస్థితులు జూన్‌ నుంచి ప్రారంభమవుతాయి.

ప్రతి ఏటా వేసవి కాలంలో దక్షిణ ఆసియాలోని హిందూ మహా సముద్రం నుంచి భూభాగం వైపు, శీతకాలంలో భూమి నుంచి సముద్రంవైపు వీచే గాలులనే రుతుపవనాలంటారు. సముద్రం నుంచి భూభాగం వైపు వీచే గాలులను నైరుతి రుతు పవనాలంటారు. శీతకాలంలో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలులను ఈశాన్య రుతుపవనాలు అంటారు.

మన దేశంలో 90 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లనే పడతాయి. జూన్‌ నెల మధ్యలో పయనించే ఈ గాలులను హిమాలయ పర్వతాలు అడ్డుకోవడంతో వర్షాలు కురుస్తాయి. ఇందుకు విరుద్ధంగా శీత కాలంలో మధ్య ఆసియాలో, ఉత్తర భారతంలో సముద్ర తీర ప్రాంతం నుంచి అతి చల్లని పొడిగాలులు తీవ్రంగా వీస్తాయి. సముద్ర జలాలతో పోలిస్తే దానికి ఆనుకుని ఉండే భూమి త్వరగా వేడెక్కడమే కాకుండా, త్వరగా చల్లబడుతుంది కూడా. దక్షిణ దిశలో ఉండే హిందూ మహాసముద్రం, తూర్పున ఉండే పసిఫిక్‌ మహా సముద్రాలతో పోలిస్తే, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాలు వేసవిలో బాగా వేడెక్కుతాయి. అందువల్ల ఆయా భూభాగాలపై ఉండే గాలి వేడెక్కి, వ్యాకోచిస్తుంది. తద్వారా దాని పీడనం తగ్గుతుంది. గాలులు ఎప్పుడూ తక్కువ పీడనం ఉన్న వైపు వేగంగా ప్రయాణిస్తాయని తెలుసుకదా? అందువల్లనే సముద్రాల మీంచి గాలులు వేగంగా భూభాగాలపైకి వీస్తాయి.

ఇక శీత కాలంలో ఆసియా భూభాగమంతా త్వరగా చల్లబడడం వల్ల దానిని ఆనుకుని ఉన్న సముద్రపు ఉష్ణోగ్రతే ఎక్కువగా ఉంటుంది. అంటే భూమిపై ఉన్న గాలులు సంకోచిస్తే, సముద్రాలపై ఉన్న గాలులు వ్యాకోచిస్తాయన్నమాట. సముద్రాలపై పీడనం తక్కువగా ఉండడం వల్లభూమిపై గాలులు ఆ దిశగా ప్రయాణిస్తాయి. ఇలా శీతకాలంలో పొడిబారిన తీరప్రాంతం నుంచి గాలులు (ఈశాన్య రుతుపవనాలు) సముద్రం వైపు వీస్తాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఎక్కువగా దక్షిణ, తూర్పు ఆసియాలపై ఉండడానికి కారణం వాటి భూభాగాల వైశాల్యం ఎక్కువగా ఉండడమే.


ప్రశ్న:ఎగిరే పాముల రహస్యమేమిటి ?


జవాబు:పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!! 

మీకు గ్లైడింగ్‌ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్‌ స్నేక్స్‌ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు. 

గ్లైడింగ్‌ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్‌ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. 

అయిదు పాముల్ని తీసుకుని వాటిపై తెల్లటి మెరిసే చుక్కల్ని అమర్చారు. ఆపై వాటిని ఎత్తయిన టవర్‌పై వదిలి అవి అక్కడి నుంచి దూకి కిందకి రావడాన్ని ఒకేసారి నాలుగు కోణాల్లో అత్యాధునిక త్రీడీ వీడియో కెమేరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లోకి ఎక్కించి, మెరిసే చుక్కల్ని బట్టి యానిమేషన్‌ మోడల్‌ పాములను సృష్టించి వాటి శరీరం ఎలాటి కదలికలకు లోనైందో గమనించారు. 

ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఈ పాములు ఎత్తు నుంచి దూకుతూనే గాలి వీచే దిశని అంచనా వేస్తూ శరీరాన్ని 25 డిగ్రీల కోణంలో తిప్పడం ద్వారా బ్యాలన్స్‌ చేసుకుంటున్నాయని గమనించారు. గాలిపటాలు, విమానాలు ఎగరడంలో కింద నుంచి పైకి వీచే గాలి శక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్నే 'లిఫ్ట్‌' అంటారు. ఈ పాములు కూడా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాయని తేలింది. తలని, తోకను వ్యతిరేక దిశల్లో చకచకా కదిలిస్తూ గాలిలోనే ఈదుతున్నట్టుగా ఎగురుతూ మార్గాన్ని కూడా మార్చుకుంటున్నాయని తేల్చారు. 

          

ప్రశ్న: '@' గుర్తు ఎలా ఆవిర్భవించింది ?


జవాబు: మెయిల్ ఎకౌంట్లని తెలియజేయడానికి వాడే @ గు ర్తు . 1885 వ సంవత్సరము నుండే వాడుకలో ఉన్నది . అప్పటిలో ఎకౌంట్ అవసరాలకోసం at the rate of అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవారు . ఆ తర్వాత కాలములో 1971 వ సంవత్సరములో కంప్యూటర్ నెట్ వర్క్ అడ్రస్ లకు మధ్య @ సింబల్ సెపరేటర్ మాదిరి గా వాడడం మొదలైనది . 1885 లో ఈ సింబల్ ని కీ బోర్డ్ లో " అమెరికన్‌ అండర్ వుడ్ (American Underwood)" మొదటిగా ప్రవేశపెట్టినది . . . కొంతకాలము కనుమరుగై 1971 లో " రేమాండ్ టోమిలిసన్‌(Raymond Tomlinson )‌ ఈ మెయిల్ మెసేజ్ లో నేచురల్ డివిజన్‌(Natural Division) గా వాడినారు . ఒక్కోక్క దేశము లో @ ని ఒక్కోక పేరుతో పలుకుతారు . 


ప్రశ్న: తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి ?


జవాబు: తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక్షత్రంగా భావించడం వల్లనే దానిని 'వేగుచుక్క' అని వ్యవహరిస్తుంటారు.


     ప్రశ్న:ఆటవస్తువులు ఎందుకు మెరుస్తాయి?

జవాబు: కొన్నిరకాల ఆటవస్తువులు చీకటిలో వెలుగునివ్వటం వెనకున్న రహస్యం వాటి తయారీలో వాడిన పదార్ధాలు. ఫాస్ఫరస్, జింక్ సల్ఫైట్, స్ట్రాన్షియం అల్యుమినేట్ లను వెలుగు విరజిమ్మేందుకు ఉపయోగిస్తారు. ఈ రసాయనాల మీద కాంతి పడినా, చార్జింగ్ చేసినా, అందులోని ఎలక్ట్రాన్స్ ఉత్తేజితమవుతాయి. ఆ తర్వాత ఆ ఎలక్ట్రాకిక్ లు ఆ శక్తిని వెలుగు రూపం లో తిరిగి వెదజల్లుతాయి. అలా వెదజల్లడం వల్లే ఆ వస్తువులు చీకటి సమయం లో వెలుగునిస్తాయి. వీటినే రేడియం వెలుగు అంటాము.

ప్రశ్న: సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా ?

జవాబు: అందమైన సీతాకికచిలుకలు మరణించినా వాటి శరీరం , రెక్కలు నిలిచి వుండటం కనిపిస్తుంది . దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్తిపంజరమే . ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యం గా ఉండే ఖైటిన్ పొర ద్వార వస్తుంది . ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ , విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి . ఈ ఖైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు , పీతలకు పెంకుపై వుండి వాటికి రక్షణ కల్పిస్తుంది .


ప్రశ్న:బార్ కోడ్స్ఎందుకు ఉపయోగిస్తారు?

జవాబు:రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు. 

వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి. 

ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి. 

 బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది. 

ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అంకెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి. 

ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.


ప్రశ్న: ఎడారులలో వర్షాలు కురవవు. ఎందువల్ల?

      జవాబు: భూమిపై ఒక ప్రాంతం ఉండే ఉన్నతాంశం(Altitude)అంటే ఎత్తు లేక లోతులపై అక్కడ కురిసే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. వర్షాలు కురిసేది ఆకాశంలో ఏర్పడే మేఘాల వల్లే. నీటికి నిలయమైన నదులు, సరస్సులు, సముద్రాల నుంచి నీరు సూర్యరశ్మికి ఆవిరయి భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లి అక్కడ ఘనీభవించడంతో మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు వాతావరణ పీడనంలోని హెచ్చుతగ్గులు, గాలులు వీచే దిశలను బట్టి పయనించి చెట్లు, అరణ్యాలు ఉండే ప్రదేశాల్లో, వాతావరణంలో తగినంత తేమ ఉండే ప్రాంతాల్లో వర్షిస్తాయి. 

ఎడారులలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు, చేమలు లేకపోవడంతో అక్కడి గాలి పొడిగా ఉంటుంది. ఆ ప్రాంతాలకు చేరుకున్న మేఘాలు కురవకుండానే ఆ ప్రాంతాలను దాటివెళ్తాయి. నీటి వనరులు ఏమీ లేకపోవడంతో, ఎడారులుండే ప్రాంతాల్లో మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడ ఉండే ఒయాసిస్సులలోని కొద్ది పాటి నీరు సూర్యరశ్మికి ఆవిరయి, చిన్న చిన్న మేఘాలు ఏర్పడినా, అవి అక్కడి అధిక వేడితో ఆవిరయిపోతాయి. 

ఆకాశంలో పయనించే మేఘాలను ఎత్తయిన పర్వతాలు అడ్డుకున్నా వర్షాలు కురుస్తాయి. ఎడారులను ఆనుకొని సాధారణంగా పర్వతాలు ఉంటాయి. ఉదాహరణకు అతిపెద్దదైన సహారా ఎడారిని ఆనుకొని ఉండే పర్వత శ్రేణులు నీరు, మంచు ముక్కలను మోసుకొస్తున్న మేఘాలను అడ్డుకోవడంతో ఆ పర్వతాలకు ఒక వైపున ఉండే ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ ప్రాంతంలోని నేల అతిసారవంతంగా ఉంటే, ఆ పర్వతాలకు మరోవైపున వర్షాలు ఏమాత్రం కురవక పోవడంతో ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. భూమిపై ఉండే ఎడారులన్నీ ఇలా ఏర్పడినవే. ఎడారుల్లో అప్పుడప్పుడూ కొన్ని జల్లులు పడతాయి. 

      ప్రశ్న: ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని, ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు. నిజమేనా?

జవాబు: ప్రతి జీవికి పరిసర పరిజ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మానవుడిలో పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందాయి. మనం చర్మం (స్పర్శ), కళ్లు (దృష్టి), చెవులు (శ్రవణం), ముక్కు (ఘ్రాణం), నాలుక (రుచి) అనే పంచేంద్రియాల ద్వారా మాత్రమే ప్రకృతి జ్ఞానం పొందుతాం. ప్రకృతి పరిజ్ఞానానికి, తెలివి తేటలకు ఇంతకు మించి మరే ద్వారమూ లేదు.

మన మెదడులోనే మనం సంతరించుకున్న జ్ఞాన ముద్రలు, సమాచారం భద్ర పరిచి ఉంటాయి. ఆసక్తి అనేది మానవుడికే ఉంది. ఆసక్తి అంటే తెలుసుకోవాలనే కుతూహలం. పుట్టినప్పట్నించి పెరిగే క్రమంలో తొలి దశల్లో ఆసక్తి అమితంగా ఉంటుంది. క్రమేపీ మెదడులో కూడా సమాచారం నిల్వ అవుతూ ఉంటుంది. ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మనకు తెలిసిన సమాచారంలో సుమారు 60 శాతం పోగవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అభ్యసనం చర్చలు తదితర సామూహిక కార్యకలాపాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

ప్రశ్న: సముద్రంలో నివసించే జలచరాలు ఉప్పు నీటినే తాగుతాయా? లేక వాటికి ఉప్పును వేరు చేసే ప్రక్రియ ఏదైనా ఉంటుందా?

  జవాబు: మన శరీరంలో పోగయ్యే లవణాల్ని, ఇతర నిరర్ధక పదార్థాల్ని మన శరీరం మూత్రం, చెమట రూపంలో విసర్జించి క్రమబద్ధీకరించుకుంటుంది. అలాగే సముద్రంలో ఉండే జలచరాలు కూడా తమ శరీరాల్లో జరిగే ప్రత్యేక యంత్రాంగం (reverse osmosis) ద్వారా లవణీయతను క్రమబద్ధం చేసుకుంటాయి. అందువల్లనే కొన్ని సముద్రపు చేపల్ని తిన్నప్పుడు అవి ఉప్పగా ఉండకపోవడాన్ని గమనించవచ్చు. అయితే మంచినీటిలో మనుగడ సాగించే జలచరాలతో పోలిస్తే సముద్రంలో ఉండే వాటి శరీర కణాల్లో లవణీయత కొంత ఎక్కువగానే ఉంటుంది. వాటి శరీరాల్లో జరిగే కొన్ని విద్యుత్‌ రసాయనిక ప్రక్రియల ద్వారా సముద్రపు జలచరాలు నీటిలో లవణీయతను తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రక్రియనే అయాను పంపు (Ion Pump) అంటారు.

ప్రశ్న: ఉసరవిల్లి ఏక కాలములో అన్నివైపులా ఎలా?చూడగలుగు తుంది ?,Chameloen can see in all directions .. How?

    జవాబు: ఉసరవిల్లి ఏకకాలం లో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారము కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచి ఉన్నా శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం?.. దీనికి వళ్ళంతా కళ్లు ఉండవు . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే , మరొకటి ఎదురుగా గాని , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదైనా ఆహారము , పురుగు దృష్టి లో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తాది ..మరో విశేసం .. . ఉసరవిల్లి డి బైనాక్యులర్ విజన్ ! .ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . దీనికుందే జిగురుకు కీటకం అటుక్కుపోతుంది. మరుక్షణం నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగుతుంది.


ప్రశ్న : తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి?

   జవాబు: తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక్షత్రంగా భావించడం వల్లనే దానిని 'వేగుచుక్క' అని వ్యవహరిస్తుంటారు.


 

జవాబు: సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని క్లుప్తంగా పంపే విధానాన్ని ఎస్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. అంటే షార్ట్‌ మెస్సేజ్‌ సర్వీస్‌ అని అర్థం. కేవలం టెక్ట్స్‌ సమాచారమే కాకుండా బొమ్మలు, ఫొటోలు, పాటల్ని, వీడియోలతో కలిపేలా సందేశాన్ని పంపడాన్నే ఎమ్‌.ఎమ్‌.ఎస్‌. అంటారు. కంప్యూటర్‌ పరిభాషలో దీన్ని మల్టీమీడియా మెస్సేజ్‌ సర్వీస్‌ అంటారు. అయితే ఎమెమ్మెస్‌ పంపాలంటే సెల్‌ఫోన్లలో ప్రత్యేక సదుపాయం ఉండాలి. ఇలాంటి సందేశాలను పంపినందుకు సెల్‌ఫోన్‌ కంపెనీలు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఎసెమ్మెస్‌, ఎమెమ్మెస్‌ల పేర్లలోనే కాకుండా సెల్‌ఫోన్లలో సమాచారం సంకేతాలుగా మారే ప్రక్రియలో కూడా తేడా ఉంటుంది. 

        

ప్రశ్న: చెవిలో గులిబి ఎందుకు వస్తుంది? దాని వల్ల ఉపయోగం ఏమిటి ?

జవాబు: పంచేంద్రియాల (sensory organs) లో చెవి కూడా ఒకటి. ఇవి పరిసరాలకు తెరిచి ఉంటాయి. దాదాపు ఒక అంగుళం మేర లోతుగా గొట్టంలాగా ఉన్న బయటి చెవి భాగం చివర కర్ణభేరి (ear drum) ఉంటుంది. గాలిలో ప్రయాణించే శబ్ద కంపనాలకు అనుగుణంగా సున్నితమైన కర్ణభేరి కంపనం చెందుతుంది. ఆ కంపనాలకు అనుసంధానంగా ఆవలి వైపుగా అంటుకుని ఉన్న ఎముకలు, ఆపై కాక్లియా అనే మరింత సున్నితమైన భాగం కూడా శబ్ద సంకేతాల్ని గ్రహిస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చెవిలో ప్రవేశిస్తే సున్నితంగా ఉండే కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రకృతి సిద్ధంగా చెవి గొట్టంలో సెబేషియస్‌ గ్రంథులు ఉంటాయి. ఇవి నూనె లాంటి జిగురుగా ఉండే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల దుమ్ము, ధూళి కణాలు ఆ జిగురుకు అంటుకుపోతాయి. అలా క్రమేపీ పోగయినవన్నీ కలిసి గులిబి (wax) అనే మెత్తని అర్ధఘన (semisolid) పదార్థం ఏర్పడుతుంది. దీన్ని వైద్యుడు మాత్రమే తొలగించగలడు. సొంతంగా పిన్నుల లాంటి పరికరాలు వాడడం ప్రమాదకరం.

ప్రశ్న: బట్టల బీరువాలో కలరా వుండలెందుకు ?

జవాబు: అల్మైరాలోని బట్టలు కంపుకొడుతున్నాయా? దీనికి కారణం అందులో చేరే బూజులు, పురుగులు కావచ్చు. బట్టలపై చేరే ఆ దుమ్ము, పురుగులు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. చెక్క అల్మైరాలలో వుంచే బట్టలకు బూజులు, పురుగులు పట్టకుండా వుండాలంటే కలరా వుండలు (Naphthalene ) ఉంచుతారు. కలరా వుండలు సులభముగా ఆవిరి అయ్యే గుణము ఉంది. 

ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులనుండి తయారుచేసే నాఫ్తలిన్‌ బాల్స్ లోని రసాయనాలు గాలిలో వ్యాప్తిచెంది కీటకాలను , బూజు క్రిములను పారద్రోలుతాయి. క్యాంఫర్ బాల్స్ వాసనకి క్రిమి , కీటకాదులు బట్టలలో చేరవు. Naphthalene consists of two benzene rings fused together. Chemical formula: C10H8. 

కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది. స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం.. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది. దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ". కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు. 

సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు. వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది... ప్రవిత్రం గా భావిస్తారు. కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి. కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది.


ప్రశ్న: చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు ?

జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.


ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.


ప్రశ్న: చీమలు ఎప్పుడూ ఒకే వరసలో ఎందుకు వెళ్తాయి ?

జవాబు: మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు ఎందుకు ఒకదాని వెనుక ఇంకోటి వెళ్తాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఎందుకు అలా వెళ్తాయో చూదాం.

       చీమలు అలా వరుసగా వెళ్ళడానికి ఒక పెద్ద కారణమే ఉంది.ఎందంటే ఒక చీమ కి ఏదైనా తినడానికి ఆహారం దొరికినప్పుడు, ఆ చీమ ఆ ఆహారాన్ని తన పుట్టలోకి తీసుకొని వెళ్తుంది. ఆ పుట్టలో చాలా చీమలు ఉంటాయి.ఆ చీమలు అన్ని ఆ దొరికిన ఆహారమును తినాలి అని చీమలు అనుకుంటాయి. అందుకని చీమలు ఆహారం తీసుకొని వెళ్ళేటప్పుడు పేరామోన్స్ అనే కెమికల్ ను వదిలి వెళ్తాయి.ఆ వాసన ను పసిగట్టి చీమలు అన్ని వరుసలో వెళ్తాయి.


చూసారా ఒక చీమ అంటే ఇంకో చీమకి ఎంత ఇష్టమో..ఒక చీమకు దొరికిన ఆహారాన్ని తాను తినకుండా తనతో పాటు ఉన్న చీమలు అన్ని తినాలి అనుకుంటాయి కాబట్టే పేరామెన్స్ అనే కెమికల్ ను వదులుతాయి.

   మీరు ఇంకోటి గమనించారా..చీమలు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయి.మీరు ఎప్పుడైనా చూసారా.

 అవి మాట్లాడుకుంటున్నాయి అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదు.చీమల పుట్టలో కొన్ని చీమలు ఉంటాయి.ఎదురు వచ్చే చీమలు తన పుట్టలోని చీమలో కాదో అని వాసన చూస్తాయి.తన పుట్టలోని చీమ కాకపోతే చీమలు అన్ని కలిసి ఆ చీమని తరిమేస్తాయి.శాస్తవ్రేత్తలు బాగా పరిశీలించి ఈ సంగతి తెలిపారు.


ప్రశ్న: ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం ?


   జవాబు: ఏ పండుకైనా గింజకానీ, విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను 'క్లోనింగ్‌' అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

    ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే 'సీడ్‌లెస్‌' (గింజలు లేని) పండ్లన్నమాట.

  నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడుతాయి. కానీ క్లోనింగ్‌ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజలలాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.  

ప్రశ్న: మనిషి రక్తం ఎర్రగా ఎందుకుంటుందో మీకు తెలుసా ?

జవాబు:: ఈ రోజుల్లో రక్తదానం యొక్క ప్రాముక్యత తెలియాన్ని వారు చాల తక్కువే, ఈ దానం ఆపదలో వున్నా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది, అయితే మీకు మనిషి రక్తం ఎర్రగా ఎందుకుంటుందో మీకు తెలుసా ? ఎందుకంటే రక్తము ద్రరూపములో ఉండే కణజాలముల సమూహము . అందులో ప్లాస్మా , ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. తెల్లరక్త కణాలు , ఎర్రరక్తకణాలు , ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎర్రరంగులో ఉండే రక్తకణాలు మానవ రక్తం లో ప్రతి చుక్క లో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఆ రక్త కణాలలో " హీమోగ్లోబిన్‌ " అనే వర్ణక పదార్ధమువలన రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. మనము పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ ని తమలో నింపుకొని శరీర భాగాలకు అందించేవి ఎర్రరక్తకణాలు , అయితే ఇదే రక్తము వెన్నెముకలేని జీవులలో మనలో లా ఎర్రగా ఉండదు. నీలి , తెలుపు రంగులో ఉంటుంది. రక్తము రంగులో తేడా ఆ జీవుల రక్తములోని పదార్ధము వల్లనే వస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉన్నరక్తమే ఎర్రగా ఉంటుంది


ప్రశ్న: ఎర్రపీతల మహాప్రయాణం ఎందుకు?

జవాబు: సముద్రంలో ఓ చిన్నదీవి.. మనుషుల జనాభా 1600.. ఎర్రపీతలు కూడా ఉంటాయి.. ఎన్నో తెలుసా? దాదాపు 15 కోట్లు! ఏటా ఇవి ఓ విన్యాసం చేస్తాయి.. అది ప్రపంచంలోనే అద్భుతమైనది! 

లెఫ్ట్‌.. రైట్‌.. లెఫ్ట్‌.. రైట్‌..! సైనికులు ఒకే విధంగా కవాతు చేస్తుంటే ఎంత బాగుంటుందో కదూ? ఆ దీవిలో ఎర్రపీతలు కూడా ఇలాగే ఒకే లక్ష్యంతో బయల్దేరుతాయి. వాటి ప్రయాణం 'ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన వలస విన్యాసం'గా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ పీతల మహాప్రయాణం ఎక్కడికో తెలుసా? సముద్ర తీరానికి. అక్కడవి గుడ్లు పెడతాయి. ఒకో పీతా లక్ష వంతున! 

ఇంతకీ ఆ దీవి ఎక్కడుందో తెలుసా? హిందూ మహాసముద్రంలో. పేరు క్రిస్‌మస్‌ దీవి. ఆస్ట్రేలియా ఆధీనంలో ఉండే దీని వైశాల్యం కేవలం 50 చదరపు మైళ్లు. ఈ దీవిలో జనాభా 1600 మందయితే, పీతల సంఖ్య 15 కోట్లు. అంటే పీతలన్నింటినీ మనుషులకు పంచిపెడితే ఒకొక్కక్కరికీ 93,750 పీతలొస్తాయన్నమాట! ఈ పీతలన్నీ ఆ దీవిలోని అడవుల్లో ఉంటాయి. నేలల్లో బొరియలు చేసుకుని ఆకులు, విత్తనాలు, పండ్లు తింటూ కాలక్షేపం చేస్తాయి. సరిగ్గా అక్టోబర్‌-నవంబర్‌ నెలల మధ్య ఏదో పనున్నట్టు బొరియల్లోంచి బిలబిలలాడుతూ బయల్దేరుతాయి. అక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరముండే సముద్ర తీరమే వాటి లక్ష్యం. ఆ ప్రయాణంలో అవి ఎత్తుపల్లాలు, ఇల్లు, భవనాలు, రోడ్లు, ఏవి అడ్డొచ్చినా ఆగవు. గునగునా.. చకచకా నడుస్తూ పోతాయి. ఆ సమయంలో ఆకాశంలోంచి చూస్తే ఎక్కడ చూసినా ఎర్ర తివాచీలు పరిచినట్టు కనిపిస్తుంది. 

సముద్ర తీరానికి చేరుకోగానే ఏం చేస్తాయి? మగ పీతలు చకచకా బొరియలు చేస్తాయి. ఆడవి అందులో దూరుతాయి. అన్నీ జతకట్టాక ఆడవక్కడ ఉండిపోతే మగవి తిరిగి అడవుల్లోకి పోతాయి. ఆడ పీతలు సముద్ర జలాల్లో గుడ్లు పెట్టేసి వెనక్కి వచ్చేస్తాయి. ఆ గుడ్లు లార్వాలై, పిల్లలయ్యాక సుమారు 5 మిల్లీమీటర్లుండే ఆ బుల్లి ఎర్ర పీతలు కూడా అడవుల దిశగా పొలోమంటూ పోతాయి. 

ఆ దీవిలో రెడ్‌క్రాబ్స్‌గా పిలిచే ఇవి సుమారు 40 మిల్లీమీటర్ల పరిమాణానికి ఎదుగుతాయి. వీటికి ఆ దీవిలో ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడిందిట. ఆఫ్రికాలో ఉండే ఎల్లోయాంట్స్‌ అనే చీమలు ఇక్కడికెలాగో వచ్చి చేరాయి. ఇవి పాపం.. ఈ ఎర్ర పీతలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఇలా ఇవి ఇప్పటికే దాదాపు 2 కోట్ల పీతల్ని చంపేసినట్టు అంచనా. అక్కడి ప్రభుత్వం ఈ పీతల ప్రయాణానికి రోడ్ల కింద నుంచి సొరంగాలు తవ్వడం, రోడ్ల మీద వాహనాల రాకపోకలు రద్దు చేయడం లాంటి చర్యలు చేపడుతోంది. 

        ప్రశ్న:మాట్లాడేటప్పుడు వూపిరి పీల్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకని ?

జవాబు: మాట్లాడ్డం అంటేనే వూపిరిని బయటకు వదిలే నిశ్వాస (expiration) ప్రక్రియకు ధ్వని కూడా తోడవడమే. గొంతులో ఉన్న శ్వాసపథ (lerynx), ఆహారపథ (pharynx) కలిసే చోట శబ్ద పేటికలు (vocal chords) ఉంటాయి. ఆ శబ్ద పేటికల కంపనమే శబ్దం. అది తన కంపనాలను నిశ్వాసంలో వూపిరితిత్తుల నుంచి బయట పడుతున్న గాలిలోకి నింపుతుంది. ఇలా శబ్ద కంపనాలను నింపుకున్న గాలి కంపనాలను భాషకు అనుకూలంగా గొంతు, అంగిటి, నాలుక, దవడలు, పలువరుస, పెదాలు, ముక్కు సమన్వయం చేసుకుంటూ మాటల రూపంలో వ్యక్తం చేస్తాయి. మాటకు, మాటకు మధ్య లేదా వాక్యానికి, వాక్యానికి మధ్య మనం గాలిని లోపలకి పీల్చుకుంటామే తప్ప మాట్లాడే క్రమంలోనే ఉచ్ఛ్వాసం(inspiration) చేయడం చాలా కష్టం.


ప్రశ్న: కొంగలకు కాళ్ళు పొడవుగా ఉంటాయెందుకు ?

జవాబు: కొంగలకు మిగిలిన శరీరము కన్నా కాళ్ళు మూడూ-నాలుగు రెట్లు పొడవుగా ఉంటాయి. మామూలు గా ఇలా పొడవు కాళ్ళు ఉండడము ఆహారము కోసము నీళ్ళలోకి వెళ్ళే పక్షులలో కనిపిస్తుంది. మిగిలిన సమయము నేలమీద , ఆహారము కోసం నీళ్ళలో నడిచే కొంగలు , ప్లెమింగోల వండి వాటికి నీరు శరీరానికి తగలకుండా ఉండేందుకు వాటి కాళ్ళు పొడవుగా ఉంటాయి.

పెరిగిన కాళ్ళ రూపానికి తగినట్లే ఈ పక్షులు లలో మెడపొడవు పెరుగుతుంది ... కిందికి వంగి నీటిలోని చేపలను అందుకునేందుకు ఆ మెడ అలా సాగింది .


ప్రశ్న: ఇళ్లలో ఉండే ట్యూబ్‌లైట్‌ను మాటిమాటికీ వేసి, ఆర్పితే జీవితకాలం తగ్గిపోతుందంటారు. ఎందువల్ల ?

జవాబు: మామూలు విద్యుత్‌ బల్బులలో ఫిలమెంట్‌ వేడెక్కడం వల్ల కాంతి ప్రసరిస్తుందనే విషయం తెలిసిందే. ట్యూబ్‌లైట్లో అలా జరగదు. పొడవైన గొట్టాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో పాదరసపు వాయువు(mercury vapour) నింపుతారు. ఈ వాయు కణాలు విద్యుత్‌శక్తితో ప్రేరేపింపబడి అయనీకరం చెందుతాయి. అప్పుడు ఏర్పడిన వికిరణాల మూలంగా కాంతి ఉత్పన్నమవుతుంది. ఈ వికిరణాలు కంటికి కనిపించని అతినీలలోహిత కిరణాలు (ultra violet rays). ఈ కిరణాలు ట్యూబ్‌లైట్‌ గొట్టం లోపలి గోడలపై పూసిన ఫాస్పర్‌ పూతపై పడి కంటికి కనిపించే కాంతిగా మారి ఆ ప్రాంతమంతా ప్రసరిస్తుంది. ఇలా వాయువు అయనీకరణం చెందాలంటే అత్యధిక విద్యుత్‌ వోల్టేజి అవసరమవుతుంది. ఇది ట్యూబ్‌లైట్‌ స్టార్టర్‌, చోక్‌ల ద్వారా అందుతుంది. ఒకసారి అయనీకరణం చెందాక ఆపై తక్కువ వోల్టేజి సరిపోతుంది. అందువల్ల స్టార్టర్‌, చోక్‌ను కటాఫ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో మాటిమాటికీ ట్యూబ్‌లైట్‌ను స్విచాన్‌, స్విచాఫ్‌ చేస్తుంటే ప్రతిసారీ అధిక వోల్టేజి అవసరమవడంతో అందులోని వాయువు అయనీకరణం చెందే ప్రక్రియకు తరచు అంతరాయం ఏర్పడుతుంది. అందువల్ల ట్యూబ్‌లైట్‌ జీవితకాలం తగ్గిపోతుంది.


ప్రశ్న: గోరింటాకు పెట్టుకున్నాక ఆ వేళ్లను పంచదార నీళ్లు, లేదా నిమ్మరసం పిండిన నీళ్లలో కాసేపు ఉంచితే గోరింటాకు బాగా పండుతుంది. ఎందుకని ?

జవాబు: గోరింటాకులోని కొన్ని వర్ణ ద్రవ్యాలు గోళ్ల లోని కెరోటిన్‌ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌తో రసాయనికంగా బంధించుకుంటాయి. అక్కడ అణునిర్మాణంలో మార్పులు రావడం వల్ల ఆ సమ్మేళనాల కాంతి ధర్మాలు (optical properties) మారిపోయి ఎరుపు రంగును ప్రదర్శిస్తాయి. అందుకే గోరింటాకు పూసుకున్న చోట ఎర్రగా కనిపిస్తుంది. గోరింటాకు పెట్టుకున్న చేతులను చక్కెర నీళ్లలోను, నిమ్మరసం పిండిన నీళ్లలోను ఉంచినప్పుడు రెండు కారణాల వల్ల ఇది మరింతగా స్థిరపడుతుంది. చక్కెర, నిమ్మరసం నీళ్ల వల్ల చర్మపు పొరలు బాగా వదులుగా అయి, చర్మం మెత్తపడుతుంది. దాని వల్ల గోరింటాకు వర్ణద్రవ్యపు అణువులు మరింత లోతుగా చర్మంలోకి ఇంకుతాయి. అలాగే వర్ణద్రవ్యాలలోని హైడ్రోజన్‌ అయాను చలనాన్ని ఈ ద్రావణాలు ప్రభావితం చేస్తాయి. దీన్నే బఫరింగ్‌(buffering) అంటారు. అందువల్ల ఆ వర్ణద్రవ్యాలు మరింత ఎరుపు రంగును వెదజల్లే అణ్వాకృతి (molecular orientation) ను పొందుతాయి.

ప్రశ్న: పశువులు రంగులు చూస్తాయా ?

జవాబు: పశువులు రంగుల్ని చూడలేవనేది నిజమే. రంగులంటే మనం చూసే సప్తవర్ణాలు, వాటి కలయికల వల్ల ఏర్పడే ఫలిత వర్ణాలే. తెలుపు, నలుపుల్ని కూడా మనం రంగులంటాం కానీ అవి నిజానికి రంగులు కావు. ఇక పశువులు కేవలం నలుపు, తెలుపు ఛాయల్ని మాత్రమే చూడగలుగుతాయి. సినిమాల్లో ఎర్ర చీర కట్టుకున్న హీరోయిన్‌ను ఎద్దు తరిమినట్టు చూపించే దృశ్యాలన్నీ నాటకీయత కోసమే. ఎర్ర చీరయినా, పసుపు చీరయినా, ఆకుపచ్చ చీరైనా పశువులకు బూడిద (గ్రే) రంగులో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నల్లటి దుస్తులు పశువులకు స్పష్టంగానే కనిపిస్తాయి...


ప్రశ్న: నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా ?

జవాబు: పాములు మణులను సృష్టించలేవు. నాగమణులంటూ ఎక్కడా లేవు. పాములు విషం గట్టిపడి అదే మణిగా మారుతుందనడం కూడా నిజం కాదు. పాములకు సంబంధించినన్ని మూఢనమ్మకాలు ఇన్నీ అన్నీ కావు. పాములు పగపడతాయని అనుకుంటారు. అది తప్పు. పాములు నాగస్వరాన్ని వింటూ ఆడతాయంటారు. ఇదీ నిజం కాదు. పాములకు చెవులు లేవు. పాములు పాలు తాగడం కూడా నిజం కాదు. అలాగే జర్రిపోతు మగపామే కానక్కర లేదు. అలాగే పాములన్నీ విషపూరితం కూడా కావు.


ప్రశ్న:ఎలుకలకు తోకలు పొడవుగా ఉంటాయి.వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా ?

జవాబు:ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతలను కావలసినంత మేరకు సరిచేసుకోవడానికి, తమ కదలికలను నియంత్రించుకోవడానికి తోకలను బాగా ఉపయోగించుకుంటాయి. మనం మన శరీరంపై ఉండే చర్మం ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వేడిని గ్రహించడం లేక ప్రసరింపజేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంతో ఉండేలా చూసుకుంటాం. కానీ ఎలుకలు అలా చేయలేవు. ఎందుకంటే, వాటి దేహాల మీద చాలా వెంట్రుకలు ఉంటాయి. అవి ఉష్ణ నిరోధకాలు. అందువల్ల ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతను చర్మం ద్వారా కాకుండా వెంట్రుకలు లేని తోకల ద్వారా నియంత్రించుకుంటాయి. ఎలుకలు వాటి గుండె నుంచి ప్రసరించే రక్తంలో 0.1 నుంచి 10 శాతం వరకు తోకల గుండా ప్రవహింప చేయగలవు. దాంతో శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిలో 20 శాతాన్ని వాతావరణంలోకి పంపగలవు. ఆ విధంగా వేసవికాలంలో వాటి దేహంలో ఉన్న ఎక్కువ ఉష్ణాన్ని బయటకు పంపించేస్తాయి. అలాగే చలికాలంలో తోకలో ప్రవహించే రక్త ప్రసరణాన్ని తగ్గించి ఉష్ణాన్ని బయటకు పోకుండా కాపాడుకుంటాయి. 

ఇక తోకల పొడవు విషయానికి వస్తే, తోకలో ఉండే కండరాన్ని ఎలుకలు అతి నైపుణ్యంగా అదుపులో ఉంచుకుంటాయి. ఇరుకైన మార్గంలో కానీ, సన్నని తీగపైన కానీ వేగంగా పరుగెడుతున్నపుడు తోకను అటూ ఇటూ కదిలించి కింద పడకుండా చూసుకుంటాయి. సర్కస్‌లో తీగపై నడిచే వ్యక్తి ఒక పొడవైన కర్రను పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్‌ చేసుకున్నట్లుగా ఎలుకలకు కూడా వాటి తోకలు బాగా ఉపయోగపడతాయి. 

       ప్రశ్న: భూమి బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా? బొంగరం కాసేపటికి ఆగిపోయి పక్కకు పడిపోయినట్టే భూమి కూడా పడిపోతుందా ?

జవాబు: మొదట భూమి ఎందుకు తిరుగుతోందో తెలుసుకుందాం. పాలపుంతలో నక్షత్రాలు, సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మన భూమి.. ఇవన్నీ కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్న వాయు-ధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. పరిభ్రమిస్తున్న వాయువుల నుంచి ఏర్పడిన ఏ వస్తువైనా ఆ వాయువుల ధర్మాన్ని కలిగి ఉండాలన్నది ఒక భౌతిక శాస్త్ర నియమం. దీనిని కోణీయ ద్రవ్య వేగ సూత్రం (law of conservation of Angular mimentum) అంటారు. ఈ నియమం ప్రకారమే పాలపుంత, సౌరకుటుంబం కూడా తన చుట్టూ తాను పరిభ్రమించే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే భూమి కూడా రోదసిలో నిరంతరంగా బొంగరంలాగా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు బొంగరం ఎందుకు ఆగిపోతుందో చూద్దాం. బొంగరం తిరిగేప్పుడు దాని చుట్టుపక్కల ఉండే గాలి వల్ల, అది ఆని ఉన్న ఉపరితలం వల్ల కలిగే ఘర్షణలాంటి బలాలు దానిపై పనిచేసి కాసేపటికి వేగం క్షీణించి పక్కకు పడిపోతుంది. అయితే భూమిపై పనిచేయడానికి అలాంటి బలాలేమీ అంతరిక్షంలో లేవు. అంతరిక్షంలో ఉండే ఘర్షణశక్తులు చాలా స్వల్పం (శూన్యానికి దగ్గర) కాబట్టి భూమి తన చుట్టూ తాను సెకనుకు 460 మీటర్ల వేగంతో (అంటే నిమిషానికి 27,600 మీటర్లు) తిరుగుతూనే ఉంటుంది. అది అలా తిరుగుతూ తిరుగుతూ అనేక వేల మిలియన్ల సంవత్సరాల తర్వాత, బహుశా పరిభ్రమణ వేగం తగ్గి, బహుశా గురత్వాకర్షణ ఎక్కువవడం వల్ల ఉత్పన్నమయ్యే బిగ్‌క్రంచ్‌ అనే ప్రభావం వల్ల ఆగిపోతుందేమో!

ప్రశ్న: టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి ?

జవాబు: సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.

ప్రశ్న:పావురము చెట్టుమీద వాలదా ?

జవాబు:పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని నమ్మకము... అభిప్రాయము. అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరంటు తీగలమీద, వైర్ల మీద వాలదు. గోడలమీద, బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది. అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణము. మిగతా పక్షులకు కొమ్మలను,తీగలను పట్టుకునేందుకు వీలుగా కాళ్ల వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు. అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు. నేలమీద, ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలకు లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవు.


ప్రశ్న: ఎస్కలేటర్ అంటే ఏమిటి ?

జవాబు: మనం రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో, పెద్ద పెద్ద షాప్ లలో ఇంకా ఎన్నోచోట్ల మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేకమందికి మెట్లేక్కే శ్రమ తగ్గింది. ఎస్కలేటర్ అంటే ఏమిటి, ఎస్కలేటర్ ఎలా పని చేస్తుంది, దానిని ఎవరు కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ను మోసుకెళ్ళే 'ఎస్కలేటర్' ను 1881 లో కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వ్యక్తి పేరు 'జెస్ డబ్ల్యు రెనో'. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే కష్టపడి, ఏళ్ళతరబడి ఆలోచించి 'ఎస్కలేటర్' ప్రాథమిక యంత్రవ్యవస్థకు అంకురార్పణ చేసారు . 'ఎస్కలేటర్' అనే మాట 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఎగ్జిబిషన్ లో వచ్చింది. ప్రపంచంలోనే 'లిఫ్టు' లు తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన 'ఓటిస్' సంస్థ తొలి ఆధునిక ఎస్కలేటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఎస్కలేటర్ పుట్టి వందేళ్ళు దాటిపోతున్నా ఇప్పుడిప్పుడే భారత దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తుంది. మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కలిగే ధ్రిల్లు చెప్పనలవికానిది. 

ప్రశ్న: ఈత రాని చేపలుంటాయా ?

జవాబు: చేప అంటే నీటిలో ఈది తీరాలిగా? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! అవును 'హాండ్‌ ఫిష్‌లు' ఆ రకమే. ఇవి ఈదలేవు. మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడచుకుంటూ నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తుంటాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. ఈ మధ్యే వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి.

ఈ చేప ఎంతుంటుందో తెలుసా? నాలుగు అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. చూడ్డానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్‌ హాండ్‌ ఫిష్‌ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందిట. అలా ముప్పు పొంచిన ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే మరి.

ఎప్పుడో 11ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన పింక్‌ హాండ్‌ ఫిష్‌ మళ్లీ ఇప్పుటి వరకూ జాడలేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాదస్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.

బ్యాట్‌షిఫ్‌ కూడా..

ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర

తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల్లాంటి మొప్పలు ఉన్నాయి. అదాటున చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్‌ఫిష్‌ అని పేరొచ్చింది. గల్ఫ్‌ తీరంలో డీజిల్‌, పెట్రోల్‌ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్‌టన్‌లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి.

ప్రశ్న: పాముచెవులు వున్న వాళ్ళని అంటారు ఎందుకు ?

జవాబు:మనలో మూడు రకాల చెవులు కనబడతాయి -మనకు కనిపించే చెవినే బాహ్మచెవి అంటారు--కర్ణభేరి వెనకాల మధ్య చెవి వుంటుంది. ఇందులో మాలియస్‌, ఇన్‌కస్‌, స్టేపిస్‌ అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది.స్టేపిస్‌ వెనకాల మొత్తని మృదులాస్థితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీనినే 'త్వచా గహనము' అంటారు.దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మొదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది.ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము. 

పాములకు వెలుపలి చెవులులేవు . వెలుపలి చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ రంధ్రం' అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్‌' అనబడే 'కర్ణస్తంభిక' అనే ఒక ఎముక ఉంటుంది. ఈ కర్ణస్తంభిక ఒకవైపు లోపలి చెవికి కలుపబడితే...మరో వైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది.గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు.నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా...అంటూ పడగవిప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదేముందు నేలమీద చేతితో చరుస్తాడు. నేలద్వారా శబ్దతరంగాలు అందుకున్న నాగుపాము పడగవిప్పుతుంది.దాని కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దానిని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగుపాము పడగ అటు ఊగుతుంది. అంతేకానీ... నాగ స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు.నాగస్వరం కాకుండా ఏది దానిముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. ఓ గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే వుంటుంది. నాగస్వరమే ఉండనక్కర్లేదు. నాగస్వరానికి నాగుపాము తలాడించడం అంతా వట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గ్రహించగలదు అనేది మాత్రమే నిజము. అందుకే అతి సున్నిత శబ్దాలను వినగలిగే సామర్థ్యమున్న వారిని ఇప్పటికీ "పాము చెవులున్నవారు" అంటారు. కనుకనే "పాముచెవులు" అనే మాట ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది.

ప్రశ్న: ఏడిస్తే కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి ?

జవాబు: కంటి కుదుళ్ళ నుండి నిత్యం కన్నీరు స్రవిస్తూనే ఉంటుది . సాధారణ పరి్స్థితులలో ఈ కన్నీరు పరిమితం గా స్రవిస్తుంది . మరి ఏడవడం అంటే ఒక మానసికపరమైన (emotional) అనియంత్రితమైన (involuntary) దైహిక స్పందన . గుండె వేగము గా కొట్టుకోవడము , రక్తప్రసరణ వేగముగా ఉండడము , ఉద్వేగానికి గురికావడం , ఇతర ఆలోచనలు , తార్కిక దృష్ఠి లోపించడము ఏడుపు సమయము లో సంభవిస్తాయి. అలాగే గొంతు గాద్గదికం కావడము , ముక్కు కారడం , మాటలు తడబడడము జరుగుతాయి. ఏడ్చే టపుడు కళ్ళలో లాక్రిమల్ గ్రందులు ఎక్కువగా నీటిని స్రవించడానికి వాటిలోనూ , కంటి పొరలలోను ఎక్కువ రక్తము సరఫరా అవడానికి రక్తకేశనాళికలు (blood capillaries) ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి పారదర్శకముగా ఉండే తెల్లగుడ్దు కింద నుంచి కనిపించడం వలనే కళ్ళలో ఎరుపు , ఎర్రటి జీరలు కనిపిస్తాయి. 

           ప్రశ్న: టీ, కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే పళ్లు వూడిపోతాయంటారు? నిజమేనా ?

జవాబు: టీ పొడిని, తేయాకు చెట్ల గుబురు పొదల్లోని లేత ఆకుల్లోంచి, కాఫీ పొడిని కాఫీ చెట్ల గింజల్నుంచి తయారు చేస్తారు. టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లావనాయిడ్లు, అమైనోఆమ్లాలు, విటమిన్లు, క్యాటికిన్లు అనే ధాతువులు బాగా ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్‌ ఈ తేనీళ్లలో తక్కువగా ఉంటుంది. కేన్సర్‌ నిరోధానికి, వూబకాయాన్ని నివారించడానికి ఇలాంటి తేనీరు మంచిదని వైద్యులు సూచిస్తారు. కానీ సాధారణంగా మనం తాగే ఎక్కువ రకాల టీ పొడుల్లో కెఫిన్‌తో పాటు, ఫ్లోరైడు ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్లకు గార పట్టించే టానిన్‌ పదార్థాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. కాఫీ పొడిలో టీ కన్నా అధిక శాతం కెఫిన్‌ ఉంటుంది. నాణ్యమైన కాఫీని మితంగా తాగే అలవాటున్న వాళ్లకు కేన్సర్‌, గుండెజబ్బులు, ఆల్జీమర్స్‌ వంటి జబ్బులు సోకకుండా ఉంటుందనీ అమితంగా తాగితే అందులో ఉన్న కెఫిన్‌ వల్ల కాలేయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు.

ఇందులో కొద్దో గొప్పో ఫ్లోరైడు ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు తాగిన వెంటనే నీరు తాగినా, పుక్కిలించి వూసినా పంటిపై గార పట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ. టీ, కాఫీల తర్వాత నీళ్లు తాగితే పళ్లేమీ వూడిపోవు.


ప్రశ్న: ఏ వస్తువైనా మండుతూ కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ భూగర్భంలో విపరీతమైన ఉష్ణం తగ్గకుండా అలాగే ఉండడానికి కారణం ఏమిటి ?

జవాబు:ఉష్ణశక్తి ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుందని చదువుకుని ఉంటారు. వేడిగా ఉన్న వస్తువు కాసేపటికి చల్లబడడానికి కారణం, దానిలోని ఉష్ణోగ్రత పరిసరాలకు సరఫరా అవడమే. కొయ్యో, పెట్రోలు లాంటి ఇంధన పదార్థాలో మండుతున్నప్పుడు క్రమేణా మంట ఆరిపోవడానికి కారణం ఆయా ఇంధనాలు తరిగిపోవడమే.

ఇక భూమిలోని అత్యధిక ఉష్ణానికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. భూమి ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి గ్రహశకలాలు వచ్చి ఢీకొనడం ఒక కారణం. భూగర్భంలో యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛేదనం (radioactive decay) చెందడం వల్ల భూగర్భంలో 80 శాతం ఉష్ణోగ్రత ఏర్పడుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల జనించే బలాలు (tidal-forces) మరో కారణం. భూమికి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల కొంత, ఇనుము, నికెల్‌, రాగిలాంటి ఖనిజాలు నిరంతరం భూమి అంతర్భాగం చేరుకునే క్రమంలో మరికొంత ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. ఇలాంటి కారణాల వల్ల భూమి అంతరాంతరాల్లో ఉష్ణోగ్రత 7000 డిగ్రీల కెల్విన్‌ వరకు చేరుకుంది. ముఖ్యంగా రేడియో ధార్మిక పదార్థాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రత భూమి ఉపరితలానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో భూగర్భంలో వేడి చల్లారకుండా అలాగే ఉంటుంది.

ప్రశ్న: సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది ?

జవాబు: సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి.

ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్‌, అది కరోనా అయినా సరే.. నీటితోపాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది. ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండటానికి గల రహస్యం దాని హైబ్రిడ్‌ నిర్మాణమే.

సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్‌, తోకభాగాన్ని హైడ్రోఫోబిక్‌ అంటారు. హైడ్రోఫిలిక్‌ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు.

 హైడ్రోఫోబిక్‌ భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్‌కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది. 

నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినపుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్‌ భాగాన్ని తనతో తీసుకుపోతుంది.

దీంతో సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్‌లు సైతం సబ్బు అణువుతో చేతి నుంచి విడుదలై బయటకు వెళ్లిపోతాయి. సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్‌ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది.

ప్రశ్న: రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు మెరుస్తాయెందుకు ?

జవాబు: రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.

పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే ప్రత్యేకమైన సన్నని పొర ఉంటుంది ఈ పొరకు కాంతిని పరావర్తనం చేసే భౌతిక ధర్మం ఉంది. కొంతమేరకు పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకారదర్పణం ఆకారంలో ఉంటుంది. కుంభాకార దర్పణంపై కాంతి కిరణాలు పడినప్పుడూ అవి పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. ఆ కిరణాల వల్లనే మనకు ఆయా జంతువుల కళ్ళూ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పొర వలనే ఆ జంతువులు చీకట్లో కూడా పరిసరాలను చూడగలుగుతాయి.

రాత్రివేళ బస్సు లో వెళుతున్నప్పుడు ఆ బస్సు లైట్ కాంతిలో జంతువుల కళ్ళు విభిన్న రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి .. పిల్లి కళ్ళు పచ్చగా , పశువుల కళ్ళు ఎర్రగా మెరవడం గమనించే ఉంటారు . ఇదంతా ఆయా జీవుల కంటి నిర్మాణం లో నున్న తేడాలు , కంటి లోపల కాంతిని గ్రహించే రెటీనాలో ఉండే స్పటికపు పొర కాంతిని ప్రతిఫలించే లక్షణము వలన , రెటీనాకు సరఫరా అయ్యే రక్తం ఈ స్పిటిక నిర్మాణములో వున్న తేడాలను బట్టి ఒక్కొక్క జీవి కళ్ళు ఒక్కొక్క రంగును బయటకు ప్రతిఫలిస్తాయి . . ఆ రంగులొ ఆ జీవుల కళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి .

ప్రశ్న: ఏడుపు (కన్నీరు)వచ్చేదాకా నవ్వుతారెందుకు ?

జవాబు:ఏడుపు (కన్నీరు ) వచ్చేదాకా నవ్వుతారు ఎందుకు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ . నవ్వినా , ఏడ్చినా కన్నీరు వస్తుంది . నవ్వు ... ఏడ్పూ రెండూ కూడా సైకలాజికల్ చర్యలే . ఎమోషన్‌ కు లోనైనప్పుడే రెండూ అనుభవిస్తాము . ఆ సమయములో కార్టిసాల్ , ఎడ్రినాలిన్‌ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి . సుఖ దు:ఖాలలో అత్యున్నత స్థాయికి చేరితే కన్నీళ్ళు పర్వంతం అవుతుంది . ఈ రెండు అవస్థలలోనూ స్ట్రెస్ తగ్గుతుంది . మనసు ప్రశాంతము తయారవుతుంది . భారము తగ్గుతుంది . అందువల్ల ఈ విషయము మనిషి ఆరో్గ్యానికి మరింత అనుకూలమైనదిగా బావించవచ్చు . 

కన్నీరు మూడు రకాలు అంటున్నారు - కనీసం ఏడుపు మూడు రకాలు! కన్నీరు కంటిలో వెలుపలి, పై మూలలో తయారవుతుంది. అది బయటికి రావడం మాత్రం లోపలి కింద మూలనుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుందని అర్థం. మిల్లి మీటరులో మూడవ వంతు మందం ఉండే ‘పంక్టా’ అనే గొట్టాలు నీటిని ముక్కులోకి, నోట్లో గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.2 నుంచి 0.3 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్ల కొకసారి, మనం, కళ్ళు ఆర్పుతాము. కొంతమంది ఎక్కువగానూ, ఎక్కువ సేపూ కళ్ళార్పుతుంటారు. అలాంటి వారు, జీవిత కాలంలో ఏడు సంవత్సరాలు అదనంగా (నిద్ర కాక) కళ్ళు మూసుకుని బతుకుతారని లెక్క తేలింది. 

కన్నీటిలో మూడు రకాల ద్రవాలుంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్లగుడ్డలో పుట్టే జిగురు ద్రవం. అది కనుగుడ్డు మీద సమంగా అంతటా పరుచుకునే ద్రవం. రెండవ పొర నీళ్లుగా ఉంటుంది. ఇది లాక్రిమల్ గ్రంధులలో తయారవుతుంది ఇందులో రకరకాల ప్రొటీన్లు, ఆంటి బయోటిక్స్, ఖనిజ లవణాలు ఉంటాయంటే ఆశ్చర్యం కదూ! ఈ కంటినీరు, కనుగుడ్లను సూక్ష్మ జీవుల నుండి కాపాడి వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో వచ్చేది మూడవ పొర. ఈ పొర లేకుంటే కన్నీరు వెంటనే కారిపోతుంది. ఆరిపోతుంది కూడా! కన్నీళ్ళకు మూడు రకాల ద్రవాలున్నట్లే ఏడుపు కూడా మూడు రకాలు, దుమ్ముపడితే వచ్చేవి ఒక రకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం, భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవరకం! ఇదీ కన్నీటి గాధ! 

  ప్రశ్న: ఏ దిక్కుకు పడుకోవాలి ?

జవాబు:మనము పడుకునే టపుడు ఏ దిక్కుకు తల పెట్టుకొని పడుకుంటే మంచిది ?. దక్షిణ దిశకు పడుకొంటే యముడు ఉంటాడని ... మృత్యువు భయముంటుందని , ఉత్తరకు తల పెట్టి పడుకుంటే ఈశ్వరఆజ్ఞా ఏనుగు తల నరికేయడం-వినాయకుడు .. .. జ్ఞాపకం వస్తుంది హిందువులకు . ఈ నమ్మకాలూ నిజమా? 

నమ్మకాలలో నిజాము లేకపోయినా భూమి గురుత్వాకర్షణ శక్తి మనపై ఉంటుందని పూర్వము శాస్త్రజ్ఞులు నమ్మేవారు ... అటు దిశ గా పడుకుంటే మన శరీరం లో అయస్కాంత క్షేత్రం దుష్ప్రభావం కలిగిస్తుందని వారి వాదన . కాని మనంతూర్పు పదమ దిశల్లో పడుకున్నా మన శరీరంలోంచి ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్నా ఆయస్కాతం బలరేఖలు వెళ్తున్నవిషయాన్ని గుర్తుంచు కోవాలి . తూర్పు పడమరాలు గా పడుకున్నా , ఉత్తర దక్కిన దిశలు గా పాదుకొని నిద్రించినఅయస్కాంత క్షేత్రంలో శరీరం ఒకే విదంగా ఉంటుందని అర్దము చేసుకోవాలి . 

ఒక పొడవాటి ఇనుప కడ్డీని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచినా , తూర్పు పడమర దిశల్లో ఉంచిన ఏమీ కాదు . కేవలందండాయస్కాన్తాల్లోనే ఈ తేడా ఉంటుంది . మన శరీరము దండ ఆయస్కాతం(barMagnet) కాదు . ద్రవ స్థితిలో ఉన్నాహెమోగ్లోబిన్ వంటి చలించే రక్తపు అణువులు మనం ఎటు పడుకునా అదే ఫలితానికి లోనవుతాయి . పుట్టిన నాటినుంచి మరణించే వరకు మన శరీరం భూ అయస్కాంతానికి అలవాటుపడిపోయి ఉంటుంది . 

 ప్రశ్న: పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా ?

జవాబు: పాముకి చెవులుండవంటే దానర్థం వినడానికి ఉపయోగపడే బాహ్య అవయవాలు దానికుండవని. కేవలం లోపలి చెవి భాగాల రూపాలుంటాయి కానీ అవి పని చేయవు. కేవలం పొట్ట చర్మం ద్వారానే పాములు శబ్దాలను గ్రహిస్తాయి. ఇక పగపట్టేంత తెలివి తేటలు, జ్ఞాపకశక్తి వాటికి లేవు. పాము నోటి నిర్మాణం ద్రవాలను పీల్చుకునేందుకు వీలుగా ఉండదు. అందుకే దారం ద్వారా పాలు పడతారు. ఇది దాని నైజానికి విరుద్ధం కాబట్టి పాలు పోస్తే వాటికి ప్రమాదం కల్గించినట్టే. విషపూరితమైన పాము కాటేస్తే ముంగిసకే కాదు, ఏ జంతువుకైనా విషం ఎక్కాల్సిందే. పిల్లీఎలుకల్లాగా పాము, ముంగిసలు ప్రకృతి సిద్ధమైన శత్రువులు కావు. అనుకోకుండా తారసపడితే గొడవపడవచ్చు. ఆ గొడవలో ఎవరికి పెద్ద గాయమైందనే విషయాన్ని బట్టి ఓసారి పాము, మరోసారి ముంగిస చనిపోవచ్చు. ఎక్కువ సార్లు ఇవి సర్దుకుని పారిపోతుంటాయి.

మనలో మూడు రకాల చెవులు కనబడతాయి -మనకు కనిపించే చెవినే బాహ్మచెవి అంటారు--కర్ణభేరి వెనకాల మధ్య చెవి వుంటుంది. ఇందులో మాలియస్‌, ఇన్‌కస్‌, స్టేపిస్‌ అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది.స్టేపిస్‌ వెనకాల మొత్తని మృదులాస్థితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీనినే 'త్వచా గహనము' అంటారు.దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మొదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది.ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము.

పాములకు వెలుపలి చెవులులేవు . వెలుపలి చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ రంధ్రం' అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్‌' అనబడే 'కర్ణస్తంభిక' అనే ఒక ఎముక ఉంటుంది. ఈ కర్ణస్తంభిక ఒకవైపు లోపలి చెవికి కలుపబడితే...మరో వైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది.గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు.నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా...అంటూ పడగవిప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదేముందు నేలమీద చేతితో చరుస్తాడు. నేలద్వారా శబ్దతరంగాలు అందుకున్న నాగుపాము పడగవిప్పుతుంది.దాని కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దానిని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగుపాము పడగ అటు ఊగుతుంది. అంతేకానీ... నాగ స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు.నాగస్వరం కాకుండా ఏది దానిముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. ఓ గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే వుంటుంది. నాగస్వరమే ఉండనక్కరలేదు. నాగస్వరానికి నాగుపాము తలాడించడం అంతా వట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది నిజము .

అందుకే...అతి సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన సామర్థ్యమున్న వాళ్ళని ఇప్పటికీ ''పాముచెవులు'' వున్న వాళ్ళని అంటారు. కనుకనే ''పాముచెవులు'' అనే మాట ప్రసిద్ధి చెందింది.


ప్రశ్న: బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?

జవాబు: లోషన్లు , పౌడర్లు , మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును .

ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని కాటన్‌ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది .

  అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి వస్త్రము తో తుడవాలి.

 సిలికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు క్లీన్‌ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.

 చింత పండు రసములో బంగారు ఆబరణాలు 30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్‌ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి .

ప్రశ్న:పాలకూర, టమాటా కలిపి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు. నిజమేనా ?

జవాబు: పాలకూర, టమాటా కలిపి వండుకుని తింటే చాలు రాళ్లు ఏర్పడతాయనేంత తీవ్ర స్థాయిలో దీన్ని నమ్మక్కర్లేదు. అయితే ఇలా చెప్పడానికి కొంత వరకూ కారణం కూడా లేకపోలేదు. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా, నీళ్లలో అయినా కాల్షియం, మెగ్నీషియం లవణాలుంటాయి. టమాట, చింతపండు వంటి వాటి రసాల్లో టార్టారిక్‌, ఆక్టాలిక్‌ ఆమ్ల లవణాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అయాన్లు, టార్టరేట్‌ లేదా ఆక్సలేట్‌ అయాన్లు కలిసినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టరేట్‌ లేదా కాల్షియం ఆక్సిలేట్‌గా అవక్షేపం (precipitate) అవుతాయి. వీటి ద్రావణీయత (solubility) తక్కువ. అయితే కిడ్నీలు వడబోయలేనంత అధికమోతాదులో ఈ లవణాలను కూరగాయల్లో ఉండవు. కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ప్రమాదం లేదు. 

అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ. 

పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.


ప్రశ్న:తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

జవాబు: అక్టోబరు - నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది . అతి వేగముతో గాలులు , భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది . 

భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది . అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది . వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది . వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను (cyclone).


ప్రశ్న:నిద్ర పోవడమేల?

జవాబు: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిద్ర ఎంతో దోహద పడుతుంది. నిద్రపోతున్నప్పుడు గుండె కొట్టుకోవడం, శ్వాసించడంలాంటి ప్రక్రియలు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మేలుకొన్నప్పుడు కోల్పోయిన శక్తిని నిద్రిస్తున్నప్పుడు శరీరం పుంజుకుంటుంది. అలాగే నిద్రస్తున్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తూ మెలుకొన్నప్పటి అనుభవాలను పదిలపరచడం, అనవసరమైన సమాచారాన్ని తుడిచివేయడం లాంటి చర్యల్లో నిమగ్నమవుతుంది. శరీరంలో ఉండే గడియారంలాంటి వ్యవస్థ మనకు కలిగే అలసటను, దాన్ని పోగొట్టుకోడానికి ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని నియంత్రించి మెదడు, నాడీ సంబంధిత ప్రసారాలు విడుదలయ్యేటట్టు చేయడంతో నిద్ర ముంచుకువస్తుంది. అలాగే పినియల్‌ గ్రంధులు (pineal glands) రాత్రివేళల్లో ఉత్పన్నమయ్యే నిద్రసంబంధిత మెలటోనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేయడం వల్ల రాత్రివేళ చీకటిలో ఎక్కువ సమయం నిద్ర వస్తుంది. ఎవరెంతసేపు నిద్రపోతారనేది జన్యు సంబంధిత విషయం. రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యకరమైన అలవాటు.


లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!

కొన్ని పదాలు చూస్తే అర్థం ఒకటే ఏమో అనిపిస్తుంది. కానీ ఆ పదాలకి మధ్య అర్థంలో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అలా మనలో చాలా మందికి లాయర్, అడ్వకేట్ అనే పదాలకి మధ్య డిఫరెన్స్ తెలియకపోవచ్చు. “వారిద్దరూ ఒక్కటే కదా?” అని అనుకుంటాం. కానీ లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య తేడా ఉంది. బైజూస్ ప్రకారం అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Difference between lawyer and advocate

లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా (LLB) డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. భారతదేశంలో ఒక లాయర్ లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) కూడా క్లియర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. LLB డిగ్రీ ఉండి, బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినవారిని అడ్వకేట్ అంటారు.

Difference between lawyer and advocate

లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే లా గురించి చెప్పగలుగుతారు. కానీ వారు కోర్ట్ లో ఒక క్లయింట్ తరపున వాదించలేరు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లైంట్ తరుపున వాదించగలుగుతారు. కేసుని బట్టి తన క్లైంట్ కి నష్టపరిహారం ఇప్పించడం లాంటివి చేయగలుగుతారు.

Difference between lawyer and advocate

అప్పుడే లా స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అవ్వటం వలన అడ్వకేట్ తో పోలిస్తే ఒక లాయర్ కి అనుభవం తక్కువగా ఉంటుంది. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి. అడ్వకేట్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అలాగే ఎన్నో కేసులను వాదించడం వలన అడ్వకేట్ కి అనుభవం ఎక్కువగా ఉంటుంది.

Difference between lawyer and advocate

లాయర్ కోర్ట్ లో కేసు వాదించలేరు. అంతే కాకుండా లాయర్ కి అనుభవం తక్కువగా ఉంటుంది. అందుకే అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఛార్జ్ చేసే ఫీజ్ తక్కువగా ఉంటుంది. అనుభవం ఎక్కువగా ఉండటం వలన, ఏ రకమైన విషయంలో అయినా ఒక క్లైంట్ తరపున వాదించే అంత పట్టు ఉండటం వలన అడ్వకేట్లు లాయర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటారు.

Difference between lawyer and advocate

ఒకవేళ ఒక వ్యక్తి ఇంగ్లాండులో, సౌత్ ఆఫ్రికాలో, లేదా స్కాట్ ల్యాండ్ లో లా చదివి వస్తే వారిని బారిష్టర్ అని అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానం. కేవలం పేరు తేడా అంతే. కానీ బారిస్టర్ కూడా అడ్వకేట్ లాగానే కేస్ టేకప్ చేసి వాదించగలరు.


ప్రశ్న:అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?

జవాబు: బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థాలను మూడు తరగతులుగా విభిజిస్తారు. అవి 

1. డయాస్కాంత(dia-magnetic),

2. పరాయాస్కాంత (paramagnetic),

3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు. 

డయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాము. నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక పరాయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండడంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదనే అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైలతుత్తం, కొబాల్టు క్లోరైడు, ఆక్సిజన్‌, మాంగనీస్‌ సల్ఫేటు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటిలో కేవలం ఇనుమే కాదు, క్రోమియం ఆక్సైడు, క్రోమియం, నికెల్‌ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమాత్రం లేకుండా అన్నీ జతలుగా ఉంటే అవి డయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో, పరమాణువుకో ఒకటో, రెండో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరాయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడమే కాకుండా అవన్నీ కవాతు చేసే సైనికుల్లా ఒకే దిశలోకి మళ్లగలిగే పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అవుతాయి.


ప్రశ్న:అవి జారి పడవెందుకు?

జవాబు:ఈగలు , చిన్న పురుగులు నున్నని గోడల పైన , గాజు పలకల పైన జారిపడిపోకుండా ఎలా నడవగలుగుతాయి ? 

కారణము : వాటి పాదాల కింద ఉండే అసంఖ్యాకమైన , బిరుసెక్కిన అతిచిన్న , సన్నని వెంట్రుకలే . పైకి నున్నగా కనిపించే ఇంటి గోడలు , పైకప్పుల కిందిభాగాలు , గాజు తలుపులు నిజానికి మన కంటికి కనిపించని అతి సూక్ష్మ మైన ఎగుడు దిగుడులు , బీటల మయమై ఉంటాయి . ఇవి ఈగలు , చిన్న పురుగుల పాదాలకింద ఉండే అతి సూక్ష్మమైన వెంత్రుకులకు కావలసిన పట్టు నిస్తాయి. .. అంతే కాకుండా ఆ జీవుల పదాల చివరి భాగాలలో ఉండే గొల్లలాంటి నిర్మాణము ఆయా ఉపరితలాలపై అస్తవ్యస్తం గా ఉండే అతిస్వల్పమైన ప్రదేశాలను గట్టిగా పట్టుకోవడం తో అవి జారకుండా ముందుకు పోగలుగుతాయి . కొన్ని పురుగులు నడుస్తున్నప్పుడు వాటి పదాల్లో కలిగే వత్తిడి వల్ల ఓ రకమైన జిగురులాంటి ద్రవం విడుదల అవుతుంది . వెంట్రుకల గుండా స్రవించే ఆ ద్రవం వల్ల కుడా అవి పడిపోకుండా నడవగలుగు తాయి .


బావి నీటి రుచికి కారణాలేంటి?*

జవాబు: బావుల్లో ఊరే నీటి రుచికి సముద్రమే కారణం కానక్కర్లేదు. చాలా మటుకు భూమి పొరల్లో ఉండే భూగర్భజలం (ground water) బావుల్లోకి ఊటలాగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని భూగర్భాల్లో సముద్రపు నీరే చేరి ఉంటుందనుకోకూడదు. అది నిజమైతే సముద్రాల ఉపరితలంపై ఉండే విపరీతమైన ఒత్తిడి బావుల్లో నీరు పొంగిపొర్లాలి. అలా జరగడం లేదు కదా! కాబట్టి ఆ బావుల్లోకి చేరే నీరు చాలా సార్లు అక్కడి భూమి పొరల్లో ఇంకి ఉన్న లవణాల కారణంగా ఉప్పగా ఉండే అవకాశాలున్నా, కొన్ని సార్లు మంచి నీరు కూడా ఊరుతుంది. అలాగే సముద్రాలకు దూరంగా ఉండే పీఠభూముల్లో కూడా ఉప్పు నీరు పడే అవకాశాలు లేకపోలేదు. అది అక్కడి భూముల తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేలల్లోని లవణాలుంటే వాటిని కరిగించుకున్న నీరు ఉప్పగా ఉంటుంది. సాధారణంగా భూగర్భజలాల్లో లవణ శాతం, సరస్సులు నదుల్లోని నీళ్ల లవణ శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.


ప్రశ్న: మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?

జవాబు: మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


ప్రశ్న: మనిషి కోమా లో ఉండడం అంటే దేమిటి? అలా అయ్యేందుకు కారణం ఏమిటి? కోమా లో ఉన్నారంటే బ్రతికి ఉన్నట్లేనా?

జవాబు: కోమా అంటే ఓ రకమైన దీర్ఘ నిద్ర లాంటిది . మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం (conscious) గా ఉండే పనులు చేయలేము . కేవలం స్వతంత్ర నాడీ వవ్యస్త (autonomousNervousSystem) అధీనం లో ఉండే శ్వాసక్రియ , హృదయ చలనం , రక్తప్రవాహం , జీర్ణక్రియ వంటి జీవ క్రియలు (PhysiologicalActivities) మాత్రమె జరుగుతాయి . మనుషుల్ని చూసి గుర్తుపట్టడం , నడవడం , మాట్లాడడం , బాహ్యపరిస్తితులకు అనుగునం గా స్పందించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు .

తలపై గట్టి దెబ్బతగిలినా , కొన్ని రసాయన ద్రవ్యాల విషప్రభావం , ఆక్షిజన్ సరఫరా తగ్గడం , రక్తం లో ఉండే గ్లూకోజ్ ను కణాలకు అందించే 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే చెక్కెర వ్యాధి ముదరడం లేదా దాని వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గడం , మెదడులో ఏదైనా కణితి ఏర్పడడం , తదితర కారణాలు వల్ల మెదడు దేహాన్ని సజావుగా నడిపించలేని విపత్కర స్థితి ఏర్పడుతుంది .. కాని స్వతంత్ర నాడీ వ్యవస్థ బాగానే పనిచేయును .. అలాంటి సమయంలో మనిషి కోమాలోకి వెళ్ళును . కోమాలోకి ఎందువల్ల వేల్లారనే కారణము తెలుసుకొని చికిత్స చేస్తే వ్యక్తి మామూలు స్థితి కి వస్తాడు .

నిద్రపోవుచున్న వ్యక్తీ జీవించి ఉన్నట్లే ... కోమాలో ఉన్నా వ్యక్తీ బ్రతికి ఉన్నట్లే .


ప్రశ్న: దిక్సూచి దిక్కుల మర్మమేమిటి?

జవాబు: భూమి విషయం కాసేపు పక్కన పెడితే, ఏవైనా రెండు అయస్కాంతాలను దగ్గరకు తీసుకొస్తే వాటి సజాతి ధ్రువాలు వికర్షించుకొంటాయనేది తెలిసిందే. అలా విజాతి ధ్రువాలు ఆకర్షించుకొంటాయి. అంటే రెండు అయస్కాంతాలను చెరో చేత్తోనూ పట్టుకుని, వాటి సజాతి ధ్రువాలను దగ్గరగా చేర్చడానికి ప్రయత్నిస్తే అవి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు చేతుల మీద కలిగే ప్రభావం ద్వారా తెలుస్తుంది. అదే వాటి విజాతి ధ్రువాలను దగ్గర చేస్తే అవి లటుక్కున అంటుకునేట్లు ఆకర్షించుకొంటాయి. 

ఒక నాణానికి బొమ్మ, బొరుసులను గుర్తించినట్టుగా ఒక అయస్కాంతానికి ఏది ఉత్తర ధ్రువమో, ఏది దక్షిణ ధ్రువమో గుర్తించడం ఎలా? ఇక్కడే భూమి మనకు సాయపడుతుంది. భూమి కూడా పెద్ద అయస్కాంతమని మనకు తెలుసు. ఒక దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుందని పాఠాల్లో చదువుకున్నారు. అందువల్లనే అయస్కాంతంలో భూమి ఉత్తరం దిశను సూచించే కొసను ఉత్తర ధ్రువమని, దక్షిణ దిశను సూచించే కొసను దక్షిణ ధ్రువమని మనం గుర్తుపెట్టుకున్నాం. నిజానికి భూమి ఉత్తర ధ్రువం, ఉత్తరదిశను సూచించే అయస్కాంత ధ్రువం, రెండూ విజాతి ధ్రువాలు. అలాగే దక్షిణం వైపున్న భూ అయస్కాంత ధ్రువము, ఆ వైపు మళ్లిన అయస్కాంత ధ్రువం కూడా విజాతి ధ్రువాలే.

ప్రశ్న: నీటిలో పడిన నూనె బిందువులుగా మారుతుంది.ఎందుకు?

జవాబు: ద్రవపదార్థాల ఉపరితలం సాగే స్వభావం కలిగి బిగువు(tension) కలిగి ఉంటుంది. దీనినే తలతన్యత (surface tension) అంటారు. దోమలు, చిన్న కీటకాలు నీటి ఉపరితలంపై మునిగి పోకుండా నిలబడడానికి కారణం ఈ తలతన్యతే. ద్రవాలకు స్వేచ్ఛ లభిస్తే తలతన్యత వల్ల అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. అన్ని ఆకారాల్లోకీ గోళాకారానికి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. అందుకే స్వేచ్ఛగా ఆకాశం నుంచి పడిన నూనె ప్రవాహ రూపంలో కాకుండా గుండ్రని బిందువులుగా మారుతుంది. చెమట, ఎత్తు నుంచి నేలపై చిందిన పాలు, వర్షం చినుకులు బిందువులుగా మారడానికి కారణం తలతన్యతే!


బల్బ్ పగిలితే ' డాం' శబ్దమెందుకు వస్తుంది? Why do we get DAM sound when bulb broken?💡

మన ఇళ్ళలోని వాడే కరంటు బల్బ్ టంగస్టన్‌ ఫిలమెంట్ మండడము ద్వారా వెలుతురు వస్తుంది. ఆ ఫిలమెంట్ ను పలుచటి గ్లాస్ బల్బ్ లో పెట్టి సీల్ చేస్తారు . ఆ సీల్ వేసేటప్పుడు లోపల గాలి లేకుండా శూన్యము చేస్తారు. గాలి ఉంటే ఆనిలోని ఆక్సిజన్‌ బల్బ్ లోపల మంటను పెందే ప్రమాదము ఉంటుంది. బల్బ్ గ్లాసు పల్చగా కనిపించినా బయటి గాలి వత్తిడిని తట్టుకునే సామర్ధ్యము కలిగిఉంటుంది. ఏ కారణముచేతనైనా బల్బ్ పగిలితే లోపల శూన్యములోనికి ఒత్తిడి గా గాలి ఒక్కసారిగా అధిక పీడనముతో ప్రవేశించినందున " ఢాం " అనే శబ్దము వస్తుంది. ఇది ఫిజిక్స్ సూత్రాల పై ఆధారపడి పనిచేస్తుంది.

రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్‌ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు.

ప్రశ్న: నీటి శుద్ధీకరణ అంటే ఏమిటి?

 జవాబు: నీటి శుద్ధీకరణ అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు కలుషితము చేసే జీవావరణమును తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్దతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్దతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.

నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, బాక్టీరియాని, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.

తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.

నీటిని చూచి పరిక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్దతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.


ప్రశ్న: నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

ఎడారులలో 'వృక్ష సంపద' అంటూ ఏమీ లేకపోయినా జెముడు (కేక్టస్‌), ఔషధ సంబంధిత గడ్డి మొక్కలు, చిన్న పొదలు అక్కడ పెరుగుతాయి.xerophytese అని ప్రసిద్ధిగాంచిన ఈ మొక్కలకు అంతగా అనుకూలించని పరిసరాలలో కూడా పెరిగే సామర్థ్యంఉంటుంది. ఇవి పెరగడానికి అతి కొద్ది పాటి నీరు (తేమ) సరిపోతుంది. ఆ నీరు సంపాదించుకోవడంలో అవి వివిధ మార్గాలు అవలంబిస్తాయి. ఉదాహరణకు, జెముడు మొక్కలు ఎపుడైనా పడిన వర్షపు తుంపరల నీటిని అనేక నెలల పాటు తమలో నిల్వ ఉంచుకోగలవు. గుబురుగా పొదల రూపంలో ఉండే హెర్బాసియన్‌ మొక్కల వేర్ల వ్యవస్థలు ఎడారులలోని భూభాగం లోపల అతి లోతుగా విశాలంగా వ్యాపించి అక్కడి భూగర్భ జలాన్ని అధిక శాతంలో పీల్చుకుంటాయి. ఎడారులలో ఉండే చెట్ల వేర్లు కూడా భూమి లోతులకు చొచ్చుకొనిపోయి అక్కడి నీటిని పీల్చుకొని, వాటి ఆకులను త్వరత్వరగా రాల్చుకొంటాయి. అందువల్ల చెట్ల ఆకుల నుంచి భాష్పీభవన ప్రక్రియ ద్వారా ఆవిరయ్యే నీటి శాతం తగ్గి, చెట్లలోనే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది? Apple is sweet and Neem is bitter Why?

జీవం' అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, 'కణ నిర్మాణం' అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. ఆపిల్‌పండును నోటికి తాకిస్తే నాలుక మీదున్న రుచిగుళికల (taste buds) మీదకు ఆయా పదార్థాలు కొద్దిగా చేరుకుంటాయి.

అక్కడ పరీక్ష చేసే డాక్టరులాగా రుచి నాడీ చివర్లు (taste nerve ends) ఉంటాయి. అక్కడ జరిగే విద్యుద్రసాయనిక చర్యల సారాంశంలో ప్రత్యేకమైన సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాలను మెదడు 'తీయదనం'గా భావించి ఇంకాస్త తినమని ప్రోత్సహిస్తుంది. వేపపండులో చేదుగుణాన్ని కలిగించే 'పిక్రిక్‌ ఆమ్లము' తదితర అవాంఛనీయమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటికి క్రిమిసంహారక లక్షణాలు (antibiotic characters) ఉన్నాయి. కాబట్టి పొలాల్లో క్రిమి సంహారిణులుగా వాడితే మంచిది. నోట్లో వేసుకొంటే ఆ నాడీ చివర్ల జరిగే రసాయనిక సంకేతాలు 'మరోలా' ఉండడం వల్ల ఆ సంకేతాల సారాన్ని మెదడు 'చేదు' అంటూ మానెయ్యమంటుంది. తినగాతినగా వేము తియ్యగా ఎప్పుడూ మారదు.

వేప చెట్టులో దాదాపు అన్ని భాగాలు చేదుగా ఉంటాయి. ప్రత్యేకంగా వేపాకులో మరీను. కారణం వేపాకులో చెడు రుచిని కలిగించే వృక్ష సంబంధ సేంద్రియ పదార్థాలే. (Phyto organic chemical) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి నింబిన్‌(Nimbin) , నింబిడిన్‌(Nimbidin)లు.


20వ శతాబ్దపు 4వ దశకంలో సిద్ధిక్వి అనే పాకిస్తాన్‌ శాస్త్రవేత్త వేపలోని రసాయనాల మీద పరిశోధనలు చేశారు. 1995 సంవత్సరంలో ఐరోపా పేటెంటు సంస్థ అమెరికా వ్యవసాయ సంస్థ (American department of agriculture) అదే దేశానికి చెందిన wr grace and company కి వేప మీద పేటెంటు హక్కుల్ని ఇచ్చింది. కానీ 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం దాదాపు 2వేల సం||రాల తరబడి వేప వినియోగం భారత దేశంలో ఉందని వాదించగా అమెరికా వారి పేటెంటు హక్కుల్ని తీసేసి భారత దేశానికి ఇచ్చారు. కానీ 2005 సం. లో తిరిగి wr grace and company భారత్‌లో వేప వాడకం ఆచరణలో ఉన్నా ప్రచురణ (publication) లేదని వాదించి తిరిగి పేటెంటు హక్కుల్ని సాధించుకొంది.


ప్రశ్న: నీరు ప్రవహిస్తున్నా నదులపై వంతెనలెలా నిర్మిస్తారు?

జవాబు: మామూలుగా వంతెనలు నదులపై వర్షాలుపడని ఆఫ్‌ సీజన్‌లో నిర్మిస్తారు. అప్పుడు నదిలో నీరు వేగంగా ప్రవహించకుండా చాలా వరకు నిలకడగా ఉంటుంది. అప్పుడు వంతెనకు స్తంభాలు నిర్మించవలసి వచ్చిన చోట నీటిలో 20 నుంచి 40 సెంటిమీటర్ల వ్యాసం గల నీరు చొరబడని పైపులను కాంక్రీటు వేయవలసిన ప్రదేశం వరకూ దించుతారు. అంతకు ముందే నిర్మించిన ప్లాట్‌ఫాం నుంచి పైపుల ద్వారా ఇనుము, స్టీలు కమ్మీలను లోనికి పంపుతారు. నీరు కలుపని గులకరాళ్లు, సిమెంటు, ఇసుక మిశ్రమాన్ని కూడా ఈపైపు ద్వారా జారవిడుస్తారు. దీనిని 'డ్రైమిక్చర్‌' అంటారు. పైపు నుంచి కిందికి దిగిన ఈ పొడి మిశ్రమం అడుగున ఉన్న నీటితో కలిసి గట్టిపడి రాయిలా మారుతుంది. పైపును దఫాల వారిగా పైకి లాగుతూ ఈ మిశ్రమాన్ని పైపుల్లో వేస్తూ వంతెనకు కావలసిన ఎత్తున స్తంభాన్ని నిర్మిస్తారు.

నీటి వేగం ఎక్కువగా ఉంటే, యంత్రాల ద్వారా నీటి వేగాన్ని తగ్గించి, నీరు ప్రవహించే దిశను మారుస్తారు. నదిలో ఎక్కువ లోతుగా ఉన్న ప్రదేశాలకు కాంక్రీటును చేరవేయాలంటే పెద్ద బకెట్లలో కాంక్రీటును నింపి, దాని పైభాగాన్ని నీరు చొరబడకుండా కాన్వాస్‌తో కప్పుతారు. ఈ బకెట్‌ను నీటిలో నిర్ణీత స్థలానికి దింపి, బకెట్‌ అడుగున ఉన్న మూతను నిదానంగా తొలగిస్తారు. తర్వాత కాంక్రీటును అక్కడ జారవిడుస్తారు. ఖాళీ బకెట్‌ను పైకిలాగి మళ్లీ కాంక్రీటుతో నింపుతారు. ఈ ప్రక్రియలో పెద్ద క్రేన్ల కన్వేయర్‌ బెల్టుల ప్రమేయం ఎంతో ఉంటుంది.

ప్రశ్న: నీళ్లలోని వస్తువుల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది.ఎందువల్ల?

 తాను నీళ్లలో మునిగినపుడు తన బరువు తగ్గినట్లనిపించడాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దపు గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ ఓ సూత్రాన్ని కనిపెట్టాడనే విషయం తెలిసిందే. ఏదైనా ఓ వస్తువు ఓ ద్రవంలో మునిగిందంటే అర్థం ఆ వస్తువుకున్న ఘనపరిమాణం మేరకు ఆ ద్రవ భాగాన్ని పైకి నెట్టి ఆ ద్రవంలో అది ఆక్రమించి నట్టేకదా! ఆ వస్తువు ఆ ద్రవంలో కరగకుండా కేవలం మునిగే ఉందంటే అర్థం ఏమిటంటే ఆ ద్రవానికి ఆ వస్తువును తనలో ఉంచుకోవడం అభిమతం కాదని, తనలోకి భూమ్యాకర్షణ ద్వారా చొచ్చుకుని వస్తున్న వస్తువును తన శక్తిమేరకు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేక దిశలో ఆ వస్తువును నెట్టివేసి తాను కోల్పోయిన తన ద్రవ భాగాన్ని తనలో నింపుకొవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఈ బలాన్నే బయాన్సీ అంటాం. దీని పరిమాణం వస్తువు ఘన పరిమాణానికి సరిపడినంత ఘన పరిమాణం గల ఆ ద్రవపు బరువు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. వస్తువు మీద భూమ్యాకర్షణ వల్ల కలిగే బలాన్నే బరువు అంటాం. ఇది భూమి వైపు ఉంటుంది. బయాన్సీ భూమికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే వస్తువు బరువు బయాన్సీ మేరకు తగ్గిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఓ వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు ఘనపరిమాణం ఎంత ఉందో అంతే ఘనపరిమాణం గల ద్రవపు బరువు మేరకు బయాన్సీ ద్వారా తన బరువును కోల్పోతుంది. దీనినే 'ఆర్కిమెడిస్‌' సూత్రం అంటారు. ఆర్కిమెడిస్‌ సూత్రం నిత్య జీవితంలో మనకు చాలాసార్లు అవగతానికి వస్తుంది.


ప్రశ్న: పాఠ్యపుస్తకాలను Text books అని అంటారు.పుస్తకమని ఎందుకు పిలవరు? పుస్తకానికి, పాఠ్యపుస్తకానికి తేడా ఏమిటి?

Text means..! As per dictionary....వ్యాఖ్యానికి మూలాధారమైనది లేదా ఆధారమైనది అని ఉంటుంది.

👉 అంటే ????

పాఠ్యాంశంలో(Lesson) ఉండే వాస్తవమైన (మూల) విషయాన్నుండీ కొంచెం మాత్రమే గ్రహించబడిన సంక్షిప్తపరచబడిన రూపమే!

కానీ...

సంక్షిప్త పరచబడిన ఆ విషయాన్ని విద్యార్థుల స్థాయినిబట్టి దానిని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించాలి లేదా విశ్లేషించి ఆ విషయాన్ని అవగాహన పరచాలి.

అదే పాఠ్యపుస్తకాలు కాకుండా ఏ ఇతర పుస్తకాలైనా మనం మన ఆసక్తి, అభిరుచిని బట్టి చదువుకుంటాం.

దానిలో అర్థం చేసుకోగలినంత, ఎవరి స్థాయిని బట్టి వారు అర్థం చేసుకొంటారు.

కానీ TEXT BOOK అలాకాదు.

ఉపాధ్యాయుల బోధన దానికి తోడై జ్ఞాన నిర్మాణం జరగాలి.

అందుకే ఉపాధ్యాయుల బోధన 2×4గా ఉండకూడదంటారు.

That means:

ఉపాధ్యాయుల బోధన రెండు అట్టల మద్య ఉన్న విషయానికి, నాలుగు గోడల మద్య బోధనకు మాత్రమే పరిమితం అవ్వకూడదని అర్థం.

కేవలం పుస్తకంలో ఉన్న విషయమైతే ఎవరైనా చెప్పొచ్చు.

కానీ ఆవిషయాన్ని మనం బోధిస్తున్న విద్యార్థుల స్థాయిని బట్టి పుస్తకంలో విషయానికే పరిమితం చేయకుండా,గది నాలుగు గోడలు దాటించి సమాజంలో జరగుతున్న విషయాలతో దానిని అనుసంధానం చేయాలి.

TEXTBOOK/బోధన సార్థకత టీచర్ పరిణితిపైనా...., విద్యార్థి జిజ్ఞాస పైనా.... ఆధారపడిఉంటుంది.


ప్రశ్న: పంచకర్మ చికిత్స అంటే ఏమిటి?

మన శరీరము నిరంతరము అనేక పనులు ఆగకుండా చేయడము వల్ల ఎన్నో వ్యర్దపదార్దములు , సూక్ష్మ జీవులు తయారవుతూ ఉంటాయి . వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని ఎరోజుకారోజు శరీరానికి కొత్తదనాన్ని ఇవ్వాలి . ప్రపంచములోని అన్ని వైద్యవిధానాల్లో ఆ భాధల నివారణకి చికిత్స ఉందికాని , వాటికి కారణమైన ఆ విషపదార్ధాలను సమూలముంగా బయటకు పంపేసి లోపల ప్రతి శ్రోతస్సుని ,, ప్రతి ధాతువును శుభ్రపరచే చికిత్సా ప్రక్రియ ఒక్క ఆయువేదము లోనే ఉన్నది . దాన్నే పంచకరం చికిత్స అంటారు .


ప్రతి మూడు నెలలకో అయిదునెలలకో ఈ పంచకర్మ చికిత్స చేయించుకోవాలి . పంచ అంటే 5 విధానాలు :


1. వమనం -- మందు కడుపులోపలికిచ్చి పొట్ట పైభాగములో ఉండే మలినాలను వాంతి చేయడం.

2. విరేచనం --ప్రేగులలో నిలువ ఉన్న వ్యర్ధపదార్ధాలను కిందనుండి మలము గా పంపడం.

3. స్నేహవస్తి -- వస్తి అంటే ఎనీమా లాంటిది . మందులతో చేసే ఎనీమా ను స్నేహవస్తి అంటాము.

4. కషాయవస్తి -- కషాయము తో చేసే ఎనిమాను కషాయవస్తి అంటాకు.

5. నశ్యము -- మందుతో కూడిన చుక్కలు , పొడిని ముక్కుద్వారా లోపలికి పంపడం.

పంచకరం చికిత్స :అటు కొన్ని వ్యాధులను చికిత్సకి , వ్యాధులు రాకుండా శరీరాన్ని , మనస్సును రక్షించుకోవడానికి ఉపకరిస్తుంది . ఇది శరీరమును శక్తివంతం చేసే సహజ పక్రియ . వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

*Highways SOS Box*: సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తుంటాము. అయితే నేషనల్‌ హైవేపై ప్రయాణం చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఆ హైవేపై కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైవేపై అధికారులు ఏర్పాటు చేసిన కొన్ని ఏర్పాట్లు మన ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇకపోతే రోడ్డు ప్రమాదాలు అనేవి నేషనల్‌ హైవేపై ఎక్కువగా జరుగుతుంటాయి. రహదారి చాలా వెడల్పుగా ఉండటం, ఎలాంటి స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, వాహనాల రద్దీ పెద్గగా ఉండకపోవడం కారణంగా వాహనాలు చాలా స్పీడ్‌గా వెళ్తుంటాయి. అలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా చాలానే జరుగుతుంటాయి. ఏదో పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా వచ్చిన కాపాడుతారు. సహాయం చేస్తుంటారు. కానీ హైవేపై ఉన్న సమయంలో సమీపంలో ఎవ్వరు కూడా ఉండరు. అలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సహాయం అందడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు తక్షణమే సహాయం అందుకోవడానికి రోడ్డుపక్కన కొన్ని బాక్స్‌లను ఏర్పాటు చేస్తుంటారు.

ఆ బాక్స్‌లను SOS అంటాము. అంటే Save our Sole. మీరు కూడా హైవేపై ప్రయాణించినప్పుడు ఈ SOS బాక్స్‌లను గమనించి ఉంటారు. వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారనే అనుమానం కూడా రావచ్చు. ఈ హెల్ప్‌లైన్‌ బాక్స్‌లు ప్రతి ఒక నేషనల్‌ హైవే మీద ఏర్పాటు చేసి ఉంటాయి. ప్రతి 300 మీటర్లకో బాక్స్‌ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బాక్స్‌ మన ప్రాణాలను కాపాడుతుంది. మనం హైవేపై వెళ్తుండగా, ఏదైనా యాక్సిడెంట్‌అయి ఫోన్‌ కూడా డ్యామేజ్‌ అయినట్లయితే రోడ్డు పక్కన ఉండే ఈ బాక్స్‌ వద్దకు వెళ్లి అక్కడ కనిపించే బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేసి యాక్సిడెంట్‌ జరిగిందన్నట్లు వాయిస్‌ ఇవ్వాలి. వెంటనే మీ వాయిస్‌ సమీపంలో ఉన్న అంబులెన్స్‌, పోలీసుస్టేషన్‌, టోల్‌ప్లాజా, ఫైర్‌ స్టేషన్‌కు వెళ్తుంది.

అంతేకాదు మన లోకేషన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్లకు లోకేషన్‌ వెళ్తుంది. వెంటనే మీకు అంబులెన్స్‌ గానీ, పోలీసులు గానీ తక్కువ సమయంలోని మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం, సహాయం చేయడం లాంటి చకచక జరిగిపోతుంటాయి. ఒక వేళ యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతంలో బాక్స్‌లేనట్లయితే మీ ఫోన్‌ నుంచి 1033 నంబర్‌కు కాల్‌ చేసినా వాళ్లు వచ్చి మీకు హెల్ప్‌ చేస్తారు. సో.. ఇదన్నమాట సహాయం కోసం ఇలాం నేషనల్‌ హైవేపక్కన ఈ బాక్స్‌లు ఏర్పాటు చేస్తారు.

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

SMC 2024 ELECTION

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం